వైఎస్సార్‌సీపీ పోరాటానికి అండగా ఉంటాం : చలసాని

24 Jul, 2018 17:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర బంద్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుర్గారావు చనిపోవడం బాధాకరమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు. దుర్గారావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోదా కోసం బంద్‌ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌ను ఇతర పార్టీలు కానీ, ప్రజలు కానీ ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. శాంతియుతంగా బంద్‌ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు. శాంతియుతంగా బంద్‌లు, దీక్షలు, ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చునని దానిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు.

గతంలో కూడా తాము దీక్షలు చేస్తామంటే చంద్రబాబు అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.. చంద్రబాబు నడి రోడ్డుపై దీక్షలు చేస్తే తప్పు లేదు కానీ, ఎవరైనా దీక్షలు చేస్తే పోలీసులచే అరెస్ట్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి అందరం అండగా ఉంటామని పేర్కొన్నారు. హోదా కోసం చంద్రబాబు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు