‘బాబు నటన ముందు వారు ఎందుకూ పనికిరారు’

22 Feb, 2019 18:49 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నటన ముందు చిరంజీవి, మోహన్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌ ఎందుకూ పనికిరారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయంలో లేకపోతే సింగిల్‌ టేక్‌లో క్లిక్‌ అయ్యేవాడన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ విపరీతంగా జరిగిందని ఆరోపించారు. భూదోపిడీపై గొడవ చేస్తే సిట్ వేశారని, సిట్ నివేదికను బయటపెట్టకూడదని జీఓ ఇచ్చి బహిర్గతం చేయలేదన్నారు.

సిట్ రిపోర్ట్ బయటపెడితే పసుపుపచ్చ రంగులో ఉన్న పాములు బయటకు వస్తాయనే భయం పట్టుకుందన్నారు. రెండుసార్లు అసెంబ్లీ సమావేశాల్లో సిట్‌పై చర్చను రెవెన్యూ మంత్రి దాటవేశారని తెలిపారు. పసుపు, కుంకుమ ద్వారా ఇస్తున్న సొమ్ము.. ఓట్లను కొనుక్కోవటమేనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి ఏయూ గ్రౌండ్స్‌ ఇవ్వకపోవటం పెద్ద కుట్ర, అప్రజాస్వామికమన్నారు. ఏయూలో  టీడీపీ అధికారిక కార్యక్రమాల పేరిట  రాజకీయ కార్యక్రమాలను చేస్తోందని తెలిపారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు