కేసీఆర్‌ స్పందించాలి.. మహేందర్‌రెడ్డి రాజీనామా చేయాలి

1 Dec, 2019 15:34 IST|Sakshi

ప్రియాంకారెడ్డి కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రియాంకారెడ్డి కుటుంబానికి జరిగిన నష్టం దేవుడు కూడా పుడ్చలేనిదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షి టీమ్స్ ప్రియాంకారెడ్డి విషయంలో ఎక్కడికి వెళ్ళాయని ఆయన ప్రశ్నించారు. నిరంతరం నిఘా పెట్టల్సిన పోలీసులు ఈ విషయంలోసంపూర్ణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను రాజకీయ నాయకులపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తూ.. ప్రజాభద్రతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

యావత్తు మహిళాలోకం ప్రియాంకారెడ్డికి న్యాయం చేయాలని గొంతెత్తిందని అన్నారు. ఎంతమంది స్పందించినా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని,
ఇంతకంటే దుర్మార్గం ఇంకేం లేదని ఆయన అన్నారు. గతంలో జరిగిన సంఘటనల్లో పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతునన్నాయన్నారు. పోలీసుల నిఘా వైఫల్యం, ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డిని తక్షణమే విధులనుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. డీజీపీ ఇప్పటికీ సంఘటనా స్థలాన్ని పరిశీలించలేదని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ ఘటన మీద తక్షణం స్పందించాలని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారికి వెన్నులో వణుకుపుట్టే చర్యలు ప్రభుతం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ సూచనమేరకు బాధిత కుటుంబసభ్యులను కలిశానని, పార్లమెంటులో సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని, బాధితుల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర మంత్రి హోదాలో రాలేదు.. : సంజీవ్‌ కుమార్‌
ప్రియాంక కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ పరామర్శించారు. ప్రియాంక దారుణ హత్యపై ఆయన సానుభూతి తెలియజేశారు. తాను ఇక్కడికి కేంద్ర మంత్రి హోదాలో.. తాను ఓ వెటర్నరీ డాక్టర్‌నేనని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు బాధకరమని.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్తానని వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

ఇలాంటి ఘటనలు జరగడం బాధకరం : దత్తాత్రేయ
తెలంగాణలో మహిళలపై వరుసగా జరుగుతున్న ఘటనలు బాధకరమని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు. వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీ ఆడిటోరియంలో గోకుల్‌ ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణాలో మహిళలపై జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు త్వరగా శిక్ష పడాలన్నారు.

మరిన్ని వార్తలు