సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మినహా ఇతర లౌకిక పార్టీలతో కలసి పోటీ చేసేందుకు సిద్ధంగా తాము ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పార్టీల నాయకత్వం అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సోమవారం కరీంనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు పెరిగాయని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం మత విభజనకు రూపకల్పనగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అంటూ రాష్ట్రంలో ఒక రాజకీయ చర్చ జరుగుతోందని, దీనికి కొందరు మంత్రులు భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని అన్నారు.