అనంత టీడీపీలో బయటపడ్డ విభేదాలు

6 Mar, 2019 16:08 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరీ(పాత చిత్రం)

అమరావతి: అనంతపురం జిల్లా టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అనంతపురం జిల్లా సమీక్షా సమావేశం వేదికగా అనంత సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరీకి సీటు ఇవ్వొద్దంటూ ఆ పార్టీ నేతలు జకీవుల్లా, జయరాం నాయుడు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభాకర్‌ చౌదరీ టీడీపీని ఎన్నడూ పట్టించుకోలేదని, ప్రభాకర్‌ చౌదరీకి గనక మళ్లీ సీటు ఇస్తే కచ్చితంగా ఓడించి తీరతామని తెగేసి చెప్పారు. దీంతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు నివ్వెరపోయారు.

ఎమ్మెల్యేపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాసి ఇవ్వాలని మంత్రులు దేవినేని ఉమ, జవహర్‌లు వారిని కోరారు. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యేపై లిఖితపూర్వకంగా రాసి ఇచ్చేందుకు జకీవుల్లా, జయరాం నాయుడులు నిరాకరించారు. సాయంత్రం సీఎం నారా చంద్రబాబు నాయుడితో జరిగే సమావేశంలో అన్ని విషయాలను తెలియజేస్తామని సమీక్షా సమావేశం నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు