'టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ'

31 May, 2020 11:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మహానాడు ఒక పెద్ద మాయ అని, పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని విఎంఆర్‌డిఎ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ విమర్శించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ధోరణిపై, మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మళ్ల విజయప్రసాద్‌తో కలిసి ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేకిగా ఉండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని తెలిపారు.(రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్‌)

మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. ' 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పనైనా చెప్పుకోగలరా ? సీఎంగా వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయి. వైఎస్‌ జగన్‌ పదవి బాధ్యతలు చెప్పట్టిన రోజు రాష్ట్రం ఊబిలో కూరుకుపోయి ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి కష్టాల్లో ఉన్న సమయంలోనూ ప్రజలను ఆదుకుంటున్నారు . వైఎస్‌ జగన్‌ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయం' అని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ..  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అందిస్తున్ననవరత్నాలు టిడిపి కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా చేరాయి. అభివృద్ధి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ప్రతీది రాజకీయం చేస్తున్నారు. ఎల్‌జీ పాలిమర్స్ బాధితులకు టిడిపి ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్టపరిహారం అడిగితే సీఎం జగన్‌ కోటి రూపాయలు ఇచ్చారు. ఎల్‌జీ పాలిమర్స్ విషయంలో టీడీపీది శవరాజకీయం' అంటూ మండిపడ్డారు. (సెప్టెంబర్‌ వరకు జీ7 సమ్మిట్‌ వాయిదా)

మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్ గుర్తించారని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో జీవో 97  రద్దు ద్వారా సీఎం గిరిజనుల పక్షపాతిగా నిలిచారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారన్నారు.మహానాడు తీర్మానాలు చూస్తుంటే టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో చేయలేదు. ఐదేళ్లలో  లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినట్టు చెప్పే చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్లో టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జెసి దివాకర్కు చెందిన బస్సు ప్రమాదం లో 30 మంది చనిపోయినా... జుట్టు పట్టుకొని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినా న్యాయస్థానాలకు గుర్తుకు రాలేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు