హరీష్‌రావు.. నీళ్లు ఎత్తుకుపోయిన దొంగ : జగ్గారెడ్డి

6 Jul, 2019 16:33 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : గత నాలుగేళ్లు సంగారెడ్డి అన్యాయానికి గురైందని, అధికారంలో లేకపోయినా నిధులు తెచ్చి సంగారెడ్డిని అభివృద్ది చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి అభివృద్దికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐఐటీ, పాలిటెక్నిక్‌, పీజీ సెంటర్‌ తీసుకొచ్చానని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పీజీ సెంటర్‌ తెస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసేస్తోందని మండిపడ్డారు.

తన పార్లమెంట్‌ పరిధిలో పీజీ సెంటర్‌ పోతే.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి బాధ్యత లేదా అని నిలదీశారు. సింగూరు నీళ్లను తాను అడ్డుకుంటే అరెస్ట్‌ చేసి, కేసుల పెట్టారన్నారు. హరీష్‌ రావు, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, చింత ప్రభాకర్‌ సంగారెడ్డి నీళ్లు ఎత్తుకుపోయిన దొంగలని ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మంజీరా నీరే మా ఎజెండా అని ప్రకటించారు. ప్రజల తరుపున ప్రశ్నస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఒక్క చుక్క నీరు సింగూరు నుంచి బయటకిపోకుండా అడ్డుకుంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలీసులే డబ్బులు పంచారని ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అవకాశమిస్తే.. ప్రజలు కోరుకున్న అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు. ముందస్తుగా చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించే సత్తా టీఆర్‌ఎస్‌కు ఉందా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు