కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు.. రేవంత్‌ రియాక్షన్‌ ఇదే..

9 Nov, 2023 10:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 

ఐటీ దాడులపై రేవంత్‌ ట్విట్టర్‌ వేదికగా..‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు.. ఖమ్మం, హైదరాబాద్‌‌లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఎనిమిదికిపైగా వాహనాల్లో ఐటీ అధికారులు ఖమ్మం చేరుకుని పొంగులేటీ ఆఫీస్‌, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అధికారులకు పొంగులేటి సహకరిస్తున్నట్టు సమాచారం. దీంతో, పొంగలేటి అనుచరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఖమ్మం పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. 

ఇది కూడా చదవండి: పొలిటికల్‌ గేమ్‌.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు