ఆజం ఖాన్‌ వల్లే రామ్‌పూర్‌ నుంచి వెళ్లిపోయాను

3 Apr, 2019 19:41 IST|Sakshi

లక్నో : బీజేపీ తరఫున రామ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు సినీ నటి జయప్రద. పుట్టినరోజు సందర్భంగా బుధవారం నామినేషన్‌ వేశారు జయప్రద. అనంతరం రామ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్‌ మూలాన నేను రామ్‌పూర్‌ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అతను నా మీద యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి చలించిన జనాలు.. ‘బాధపడకండి.. మేం అంతా మీకు తోడుగా ఉంటాం’ అని ఆమెను ఓదార్చారు.

తర్వాత తనను తాను సముదాయించుకున్నారు జయప్రద. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కానీ తొలిసారి ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఉ‍న్నాను. ఎందుకంటే నా వెనక బీజేపీ ఉంది. గతంలో నేనేప్పుడు ఇలా ఏడ్వలేదు. నాకు బతికే హక్కు ఉంది.. జీవిస్తాను మీకు సేవ చేస్తాను. మహిళలకు రక్షణ, గౌరవం లభించే పార్టీలో చేరినందుకు నాకు చాలా గర్వంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక ‘దేవున్ని ఒక్కటే వేడుకుంటున్నాను. మరోసారి ఈ యుద్ధంలో నన్ను గెలిపించు.. జనాలకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుకుంటున్నట్లు’ తెలిపారు.

గతంలో జయప్రద రెండు సార్లు 2004, 2009లో రామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ఆజం ఖాన్‌ మీద చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే 2004 ఎన్నికల్లో ఆజం ఖాన్‌ జయప్రద తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్న వారు కొద్ది బద్ద శత్రువుల్లా మారారు.

>
మరిన్ని వార్తలు