నారా లోకేశ్‌కు ఊహించని షాక్‌

21 Mar, 2019 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గురువారం వైఎ‍స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆమె కలిశారు. వైఎస్సార్‌సీపీ కండువాతో ఆమెను పార్టీలోకి సాదరంగా వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు. తమ కుటుంబానికి టిక్కెట్‌ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేయడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. (మీ నాన్న టికెట్‌ ఇస్తామని మోసం చేశారు..)


మాట తప్పినందుకు నిరసనగా..
మంగళగిరి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని కాండ్రు కమల విమర్శించారు. నమ్మించి మాట తప్పినందుకు నిరసనగా టీడీపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీని ఓడించడానికి అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. బేషరతుగా వైఎస్సార్‌సీలో చేరినట్టు తెలిపారు. బీసీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశానని ఆరోపించారు. చంద్రబాబు మోసాల పట్ల బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అధికారం నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెబుతున్నారని, గుంటూరు జిల్లాలో తన సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరపున ముగ్గురు మహిళలకు వైఎస్‌ జగన్‌ సీట్లు ఇచ్చారని, సామాజిక సమత్యులత పాటించారని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే రాజన్న పరిపాలన మళ్లీ చూస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు.

మరిన్ని వార్తలు