ప్రచారానికో రూపాయివ్వండి!

29 Mar, 2019 11:13 IST|Sakshi

ఓటర్లకు కన్హయ్య వినతి

కన్హయ్య కుమార్‌ గుర్తున్నాడా.. దేశ ద్రోహం నేరం కింద 1996లో అరెస్టయిన డిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం  అధ్యక్షుడు. ఇప్పుడాయన బిహార్‌లోని బెగుసరాయ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇతర పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంటే మన కన్హయ్యకు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు లేవట. అందుకే ఒక్కొక్కరు కనీసం ఒక్క రూపాయి అయినా విరాళం ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు.

‘బొట్టుబొట్టుతో కుండ నిండినట్టు మీరిచ్చే ఒక్కొక్క రూపాయే నాకు ప్రచారానికి ఉపయోగపడుతుంది’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నాడు. తాను గెలిస్తే అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల వాణిని పార్లమెంటులో వినిపిస్తానని హామీ ఇస్తున్నాడు. నిధుల సేకరణ కోసం కన్హయ్య ఆన్‌లైన్‌లో క్రౌడ్‌ ఫండింగ్‌ ఫ్లాట్‌ఫాంను కూడా ప్రారంభించాడు. బెగుసరాయ్‌ నియోజకవర్గంలో ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో తలపడుతున్నాడు. ‘ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించాలని బిహార్‌ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో తాను గెలవడం ఖాయ’మని అంటున్నాడు. విరాళాల సేకరణ ప్రారంభించిన తొలిరోజే రూ. 38 లక్షలు సమకూరాయి.

మరిన్ని వార్తలు