నేడే ఆరో దశ

12 May, 2019 04:32 IST|Sakshi

7 రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఓటింగ్‌

ఢిల్లీలోని 7 స్థానాలకు కూడా

న్యూఢిల్లీ: ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 1.13 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ విడతలో 10.17 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలతో పాటు హరియాణా(10), బిహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), పశ్చిమబెంగాల్‌(8), ఢిల్లీ(7), జార్ఖండ్‌(4) సీట్లకు ఆరో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బీజేపీకి ఎదురీత: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ ఏకంగా 45 సీట్లను సొంతం చేసుకుంది. ఈసారి యూపీలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కూటమి బీజేపీ జోరుకు బ్రేకులు వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి గట్టిపట్టున్న గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ సీట్లను ఎస్పీ–బీఎస్పీ కూటమి దక్కించుకోవడం ఇందుకు ఉదాహరణ. 2014లో యూపీలోని ఈ 14 సీట్లలో 13 స్థానాలను బీజేపీ దక్కించుకుందనీ, ఈసారి ఆ పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు లేవని వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉండనుంది. దేశరాజధానిలో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 60,000 భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య తెలిపారు.

బరిలో ఉన్న ప్రముఖులు వీరే
నరేంద్రసింగ్‌ తోమర్‌ (బీజేపీ – మొరేనా), ప్రజ్ఞాసాధ్వీ ఠాకూర్‌ (బీజేపీ– భోపాల్‌) , మేనకాగాంధీ (బీజేపీ – సుల్తాన్‌పూర్‌) , గౌతం గంభీర్‌ (బీజేపీ – తూర్పు ఢిల్లీ), రీటా బహుగుణా జోషి (బీజేపీ – అలహాబాద్‌), హర్‌‡్షవర్ధన్‌ (బీజేపీ–ఢిల్లీలోని చాందినీచౌక్‌), దిగ్విజయ్‌ సింగ్‌ (కాంగ్రెస్‌– భోపాల్‌) , జోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్‌ – గుణ) , షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌ –ఈశాన్య ఢిల్లీ), భూపేందర్‌సింగ్‌ హుడా (కాంగ్రెస్‌– సోనిపట్‌), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ– అజాంగఢ్‌), విజేందర్‌ సింగ్‌ (కాంగ్రెస్‌–దక్షిణ ఢిల్లీ),దుష్యంత్‌ చౌతాలా (జేజేపీ–హిస్సార్‌), దీపేందర్‌ హుడా (కాంగ్రెస్‌ –రోహ్‌తక్‌)

మరిన్ని వార్తలు