అధికార దాహంతోనే అక్రమ పొత్తులు’

29 Oct, 2018 02:54 IST|Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీ రాజకీయ విలువలను దిగజార్చి అక్రమ పొత్తులు పెట్టుకుంటున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఆరోపించారు. ఆదివారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. ఎన్టీఆర్‌ హయాంలో కాంగ్రెస్‌ను దొంగ పార్టీ అన్నారని, ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు.

14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాటం జరిగిందని, బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు