మాజీ సీఎంకు షాకిచ్చిన మాయావతి..!

9 Feb, 2019 19:51 IST|Sakshi

హర్యానాలో బీఎస్పీ, ఎల్ఎస్పీ పొత్తు

చండీగఢ్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టిసారించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎస్పీ అధినేత్రి మాయావతి కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టారు. హర్యానా మాజీ సీఎం  ఓమ్‌ ప్రకాశ్‌ చౌతాలాకి షాకిచ్చి మరోపార్టీతో చేతులు కలిపారు. చౌతాలా సారథ్యలోని ఐఎన్‌ఎల్‌డీకు మాయావతి గుడ్‌బై చెప్పి.. బీజేపీ రెబల్‌ ఎంపీ రాజ్‌కుమార్‌ సైనీ నేతృత్వంలోని లోక్‌తంత్రా సురక్షా పార్టీ( ఎల్‌ఎస్పీ)తో ఆమె చేతులు కలిపారు. ఈ మేరకు శనివారం రెండు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఎనిమిది, ఎల్‌ఎస్పీ రెండు స్థానాల్లో కలిపి పోటీచేస్తున్నట్లు శనివారం వారు వెల్లడించారు. ఇదే పొత్తు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఐఎన్‌ఎల్‌డీ బలహీన పడుతున్నందునే మాయావతి వ్యూహాత్మకంగా ఎల్ఎస్పీతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీస్పీ, ఐఎన్‌ఎల్‌డీ వరస ఓటములను చవిచూసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు