లక్నో : మతపరమైన నినాదాలు చేయాలని ఒత్తిడి తెచ్చే ప్రమాదకర ధోరణి యూపీ సహా పలు రాష్ట్రాల్లో పెరిగిపోయిందని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలపై కేంద్రం, యూపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అభివృద్ధితో రాజీపడకుండా, సమాజంలో సోదరభావం, సామరస్యం పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా ఘటనలపై తీవ్రంగా స్పందించాలని మాయావతి ట్వీట్ చేశారు.
యూపీలో నేరాల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె గతంలో ఆరోపించారు. మూక హత్యలపై బీజేపీ ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. దళితులకు వ్యతిరేకంగా జరిగే నేరాల్లో యూపీ ముందువరుసలో నిలిచిందని ఆరోపించారు. మాయావతి ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఎన్నికల్లో ఘోర వైఫల్యాలతో బీఎస్పీ చీఫ్ నిస్ప్రహలో ఉన్నారని పేర్కొంది.