‘కొత్త సీసాలో పాత సారాలా ఉంది’

8 Feb, 2018 20:11 IST|Sakshi
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి(పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సమస్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో గురువారం చేసిన ప్రకటన కొత్త సీసాలో పాత సారాలా ఉందని వైఎస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా నిలబెట్టాలనే చిత్తశుద్ధి నిజంగా ఉంటే కేంద్రంలోని మంత్రులతో, ఎంపీలతో రాజీనామా చేయించాలని అన్నారు. రాష్ట్ర మంత్రులను, ఎంపీలను ముందు కూర్చొబెట్టుకుని ఏపీకి ఒరగబెట్టేలా ఏదో తీవ్రంగా చర్చిస్తున్నట్లు చంద్రబాబు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

నాలుగేళ్లుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేకపోయారని దుయ్యబట్టారు. ఇంకా చూస్తాం, చేస్తాం అంటూ బీజేపీ ప్రభుత్వం కూయడం దారుణమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రం గురించి కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం ముందు సాగిలపడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చి అవకాశవాదిగా మారడం కన్నా దారుణం మరోటి లేదని అన్నారు.

మరిన్ని వార్తలు