కోడికి చారానా.. మసాలాకు బారానా

3 Jun, 2020 07:59 IST|Sakshi

కేసీఆర్‌ పాలన తీరుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణకు నీళ్లు ఇస్తది అన్నట్లుగా కేసీఆర్‌ గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారని, కేసీఆర్‌ పాలన ‘కోడికి చారానా.. మసాలాకు బారానా’ అన్నట్లు ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అనేక డ్యామ్‌లను కాంగ్రెస్‌ పా ర్టీ అందుబాటులోకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ఏడు ప్రాజెక్టులకు కేవలం 10శాతం నిధులిస్తే పూర్తవుతాయని, నాలుగు జిల్లా ల్లో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తే 10లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు.
(మెడికల్‌ కాలేజీలో 12 మందికి కరోనా)

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి పేరు వస్తుందనే దురాలోచనతో కేసీఆర్‌ పూర్తి చేయడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేయడం దారుణమని, దీన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇది బతుకుల తెలంగాణనా? లేక చావుల తెలంగాణనా అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా కేసీఆర్‌ పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ‘మన తెలంగాణ–మన పాలన’ అని ఆశపడ్డ ప్రజల కల సాకారం కాలేదన్నారు. ( సోనియమ్మకు ధన్యవాదాలు..) 

మరిన్ని వార్తలు