మామా అల్లుళ్లు దోచేస్తున్నారు..

1 Mar, 2019 09:19 IST|Sakshi
పలాస–కాశీబుగ్గ పట్టణంలో ఎమ్మెల్యే రోజా రోడ్‌షో.. పక్కన సీదిరి అప్పలరాజు

చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి

ఎస్టీ జాబితాలో చేర్చమంటే మత్స్యకారుల

తాట తీస్తామంటారా..

ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదా తాకట్టు

పలాసను మామా అల్లుళ్లు దోచేస్తున్నారు

నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రోజా

పలాస నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్‌కే రోజా జరిపిన రోడ్‌షో, ఆత్మీయ సమ్మేళనం పార్టీ శ్రేణులను ఉత్సాహపరచింది. ముందుగా పలాస–కాశీబుగ్గ పట్టణానికి చేరుకున్న రోజా పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తదితరులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఆమెకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో జరిగిన సభలో రోజా మాట్లాడుతూ చంద్రబాబు పాలన, ఎమ్మెల్యే శివాజీ కుటుంబ సభ్యుల దందాలపై నిప్పులు చెరిగారు.

వజ్రపుకొత్తూరు/ వజ్రపుకొత్తూరు రూరల్‌: పలాస నియోజకవర్గంలో గౌతు శ్యామసుందర శివాజీ అల్లుడు వందల కోట్లు వసూళ్లు చేపడుతూ వసూళ్ల చౌదరి (వీసీ)గా అవతారమెత్తాడని, మామ ఎమ్మెల్యేగా ఉన్నపుడే ఇంతటి అవినీతికి పాల్పడుతున్న వీసీ రేపు భార్య ఎమ్మెల్యే అయితే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని వైఎసార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో గురువారం పలాస సమన్వయకర్త  డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. పలాస–కాశీబుగ్గ పట్టణం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి బైక్‌లపై ర్యాలీగా వచ్చిన ఆమెకు నువ్వలరేవు గ్రామ పెద్దలు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంగళ హారతులు పట్టి తిలకం దిద్దారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆమె రాక కోసం  ఎదు రు చూశారు. అనంతరం ఆమె కాన్వాయ్‌పై నుంచి అశేష జన వాహినిని ఉద్దేశించి మాట్లాడారు. దేశమంతా జీఎస్టీ నడుస్తుంటే పలాసలో మాత్రం గౌతు సర్వీస్‌ ట్యాక్స్‌ నడుస్తోందని విమర్శించా రు. గౌతు కుటుంబానికి రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇస్తామని మోసం
గత ఎన్నికల్లో  మత్స్యకారుకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించి అది నేటి వరకు అమలు చేకుండా ఆ ఎమ్మెల్సీ పదవులను ముడుపులకు అమ్ముకున్నారని రోజా విమర్శించారు. పసుపు కుంకుమ పేరుతో స్వయం శక్తి సంఘాల మహిళలకు బాబు మరో మోసానికి తెర తీసాడని, పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు ఇచ్చి మోసం చేయాలనుకున్నాడంటూ మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవమన్న చంద్రబాబు.. 40 ఏళ్ల వయసున్న జగన్‌మోహన్‌రెడ్డిని చూసి వణికిపోతున్నాడని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు. నువ్వలరేవులో ఎక్కువ మంది అగ్రి గోల్డ్‌ బాధితులు ఉన్నారని, వారికి న్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. లోకేష్, చంద్రబాబు కలిసి అగ్రిగోల్డ్‌ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ కాజేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంతకు ముందు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మాట్లాడారు. మత్స్యకారులకు జట్టీలు లేక అవస్థలు పడుతున్నారని, కోల్డ్‌ స్టోరేజీలు లేక చేపలను దాచుకోలేని దుస్థితి ఉందన్నారు.

ఉన్నత చదువులు చదివేందుకు గ్రామంలో ఒక్క ఉన్నత పాఠశాల కూడా లేదని, ఇది నియోజకవర్గ పాలకులకు పట్టదా అంటూ విమర్శించారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇక్కడ కేవిటీలకు బీసీ ఏలో చేర్పించి మేలు చేసారని, జగన్‌మోహన్‌రెడ్డి వస్తే మళ్లీ మత్స్యకారులకు మంచి రోజులు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, జిల్లా మహిళా అధక్షురాలు చింతాడ మంజు, జిల్లా మాజీ అధ్యక్షురాలు ధర్మాన పద్మప్రియ, ఇచ్ఛాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజేశ్వరి, రాష్ట్ర  మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జుత్తు ధనలక్ష్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, జిల్లా కార్యదర్శులు దువ్వాడ హేమబాబు చౌదరి, మెట్ట కుమార స్వామి, డొక్కరి దానయ్య, బల్ల గిరిబాబు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, పైల చిట్టి, ఉంగ  సాయిక్రిష్ణ,  ఉపాధ్యక్షుడు మవద్దివల హరినా రాయణ, మాజీ సర్పంచ్‌ బెహరా ధర్మారావు, రఘు, శ్యామ్, బెహరా ఎర్రయ్య, గ్రామ పెద్దలు నరిసింహమూర్తి,  మండల యువజన విభాగం అధ్యక్షుడు కొల్లి రమేష్, మండల మహిళా విభాగం అద్యక్షురాలు తామాడ సరస్వతి,  మం డల ప్రధాన కార్యదర్శి టి. శాంతారావు, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు మరడ భాస్కరరావు పాల్గొన్నారు.

రోడ్‌ షో సక్సెస్‌
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ పట్టణంలో ఎమ్మెల్యే రోజా నిర్వహించిన రోడ్‌ షో విజయవంతమైంది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. గురువారం పలాస నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వచ్చిన ఆమె ముందుగా పలాస–కాశీబుగ్గ పట్టణంలో  సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు స్వగృహానికి చేరుకుని సేదతీరారు. అనంతరం అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. కోసంగిపురం కూడలి మీదుగా జాతీయ రహదారిపై పలాస మొగిలిపాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కాశీబుగ్గ చేరుకుని కారుపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.

మరిన్ని వార్తలు