చంద్రబాబు తీరు కరెక్ట్‌ కాదు : ఎమ్మెల్సీ సోమువీర్రాజు

1 Dec, 2017 11:44 IST|Sakshi

సాక్షి, కాకినాడ : పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. కాకినాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలిపిన అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనవసర రాజకీయాలు చేయకుండా.. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చంద్రబాబును ఆయన కోరారు.

ఇది కూడా చదవండి... పోలవరంపై చేతులెత్తేసిన చంద్రబాబు

నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనపై వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తేనే అనే పదం సీఎం వాడటం సరికాదని.. సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆయన చెప్పారు. ’’పోలవరంపై రాజకీయం వద్దు. టెండర్ల విషయంలో అనవసర గందరగోళం సృష్టించొద్దు. ప్రాజెక్టు విషయంలో కమిట్‌ మెంట్‌తో పని చేస్తున్నది బీజేపీ మాత్రమేనని ఆయన చెప్పారు. గతంలో రాజ్యసభలో ముంపు మండలాలపై అప్పటి బీజేపీ సీనియర్‌ నేగా ఉన్న వెంకయ్యనాయుడు ఒక్కరే మాట్లాడారని.. అప్పుడు టీడీపీ తరపున ఎంపీలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సమన్యాయం అంటూ కిక్కురుమనకుండా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా వీర్రాజు గుర్తు చేశారు. 

కేంద్రపై నెపం నెట్టేయటం మంచి సంప్రదాయం కాదని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. సమస్యలను అధ్యయం చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. చాతగాక కేంద్రానికి వెనక్కి ఇచ్చేస్తాం అన్న సీఎం తీరు సరికాదని సోమువీర్రాజు తెలిపారు. 

జలీల్‌ఖాన్‌కు ఆ అర్హత లేదు : విష్ణువర్ధన్‌ రెడ్డి

అనంతపురం : కోట్లు తీసుకుని పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్‌కు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. అవసరమైతే అడుక్కుని అయినా పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు సేకరిస్తామని నిన్న జలీల్‌ఖాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జలీల్‌ ఖాన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని.. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేసి తీరుతుందని విష్ణువర్ధన్‌ చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు