బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి

17 Nov, 2023 15:39 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మానవతా దృక్ఫథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు న్యాయ వాదులు అఫిడివిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరారని.. చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప, ఎక్కడా తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదన్నారు.

‘‘చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం చచ్చిపోతున్నారని పచ్చ మీడియా వార్తలు రాసింది. చనిపోయిన వాళ్లని ఓదార్చుతామని, నిజం గెలవాలని భవనేశ్వరి యాత్ర చేపట్టారు. బయటకు వచ్చాక యాత్ర ఎందుకు ఆపేశారు? అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ డ్రామాలపై నిజం గెలవాలని మేమూ డిమాండ్  చేస్తున్నాం. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్‌గా పరిశీలించాను. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు. బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు ఎందుకు’’ అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు.

సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు. బెయిల్ పొడిగించుకోవడానికి ఈ మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ రిపోర్ట్స్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు. ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు. బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్‌లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు’’ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు.
చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా?

మరిన్ని వార్తలు