ఎండల్లో తిరిగి మైండ్‌ పోయిందా?

18 Apr, 2019 11:14 IST|Sakshi

చంద్రబాబుకు మహమ్మద్‌ జానీ ప్రశ్న

నెహ్రూనగర్‌ (గుంటూరు): రాష్ట్రంలో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మహమ్మద్‌ జానీ అన్నారు. గుంటూరులో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్‌ వ్యాపారులతో కలిసి గుడ్డి పత్తి అమ్ముకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీకి 150 సీట్లు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో మొత్తం 175 సీట్లు ఉంటే 150 సీట్లు టీడీపీకి వస్తాయా? ఏమిటీ నీ లెక్కలు? ఎండల్లో తిరిగి మైండ్‌ పోయిందేమో డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకో’ అంటూ సలహా ఇచ్చారు.

చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విడదల రజని ఈ ఎన్నికల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు నిద్ర లేకుండా చేశారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంమంత్రిగా కోడెల శివప్రసాదరావు పని చేశారని, రాజకీయ అనుభవమున్న నాయకుడు హుందాతనంగా వ్యవహరించాల్సింది పోయి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారిలా ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతానని భయపడి ఈవీఎంలపై నెపం పెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో జులిఫకర్‌ అలీ, కరిముల్లా పాల్గొన్నారు. (చదవండి: జూన్‌ 8 వరకూ నేనే ముఖ్యమంత్రి)

మరిన్ని వార్తలు