కేసీఆర్‌ కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు : మోత్కుపల్లి

8 Apr, 2019 13:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇప్పుడు పసుపు-కుంకుమ అంటున్నావ్.. పరిటాల సునీత, వంగవీటి రత్నకుమారిల పసుపూ, కుంకుమ తుడిచింది నువ్వు కాదా చంద్రబాబు అని టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పి.. వైఎస్‌ జగన్‌కు ఓటేయాలని ప్రజలకు ఆయన విఙ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన మోత్కుపల్లి అనంతరం మాట్లాడుతూ.. వెన్నుపోటు, అక్రమాలకు మారుపేరు చంద్రబాబు అని మండిపడ్డారు. పార్టీలో అందరూ వద్దన్నా కేవలం అల్లుడనే కారణంగా ఎన్టీఆర్ చంద్రబాబుని పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. అలాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. అతడిని పార్టీలోకి తీసుకున్నందుకు ఎన్టీఆర్‌ ఎన్నోసార్లు ఏడ్చారని.. గాంధీని చంపిన గాడ్సే కంటే కూడా చంద్రబాబు నీచుడని ఎన్టీఆర్‌ అన్నారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ టీడీపీ జెండాను దొంగిలించిన చంద్రబాబు ఓ దొంగ ఐతే..తాను పెట్టిన పార్టీకి ఏకైక మొనగాడు వైఎస్‌ జగన్ అని వ్యాఖ్యానించారు.

29 కేసులకు స్టే తెచ్చుకున్నావు..మర్చిపోకు
మోత్కుపల్లి మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ సొంత పార్టీతో ఒంటరిగా వెళుతున్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోతే చంద్రబాబు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.  రాజకీయ ప్రత్యర్థి చనిపోయాడు అన్న సంతోషమే తప్ప సాటి మనిషి ప్రాణం పోయిందన్న బాధ ఏమాత్రం లేని శాడిస్ట్ చంద్రబాబు. వైఎస్‌ జగన్‌ మీద 31 కేసులు ఉన్నాయని చెబుతున్నావు... కానీ నీ మీద 29 కేసులున్న సంగతి మర్చిపోకు చంద్రబాబు. వాటన్నిటికీ స్టే తెచ్చుకున్న వ్యక్తివి నువ్వు.. అవినీతితో లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబూ.. ఈ రోజు నీ కోసం, నీ కొడుకు కోసం మాత్రమే బతుకుతున్నావ్....తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదు. ప్రస్తుతం అన్ని సర్వేలు వైఎస్‌ జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడిస్తున్నాయి. చంద్రబాబువి అన్నీ దొంగ సర్వేలు. ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్‌ జగన్‌ను గెలిపించండి. చంద్రబాబును చిత్తు చిత్తుగా ఒడించండి’ అని పిలుపునిచ్చారు.

ఆంధ్రుల కోసం పోరాటం చేసింది వైఎస్‌ జగన్‌ మాత్రమే..
‘పొద్దున లేస్తే చాలు కేసీఆర్‌ను తిడుతున్నావు. కేసీఆర్ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు బాబు. ఈరోజు నేను రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం లేదు ప్రజల కోసం మాట్లాడుతున్నాను. వైఎస్‌ జగన్‌ మాత్రమే ఆంధ్రుల హక్కుల కోసం పోరాడారు. నువ్వు ఒక్కనాడు కూడా ఆంధ్ర ప్రజల కోసం పోరాటం చేయలేదు. మొన్నటిదాకా మోదీ గ్రేట్ ప్రధానమంత్రిని పొగిడి.. ఇప్పుడు ఆయన చెడ్డవాడు అని చెబుతున్నావు. నీది నాలుకా లేదా.. తాటి మట్టా చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం ఒక్కనాడైనా పోరాడావా? నీకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణ ఆరు మండలాలు ఏపీలో కలిపిన కేంద్రం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు. కేసీఆర్‌ను కలుపుకొని ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. విభజన చట్టం కింద 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైద్రాబాద్‌ నుంచి పారిపోయావు.  నాకు కులం లేదని అంటున్న చంద్రబాబు కుల అహంకారి. మాల, మాదిగలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారు అని నీచ వ్యాఖ్యలు చేశాడు. ఆరుగురికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. వాళ్ళందరికీ ఏ కుల ప్రాతిపదికన ఇచ్చావు. రూ. 100 కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు. ఒక్కో పదవికి వందల కోట్లు లంచం తీసుకున్నావు’ అని మోత్కుపల్లి చంద్రబాబు తీరును ఎండగట్టారు.

మరిన్ని వార్తలు