ఓడిపోయిన అభ్యర్థికి మెజార్టీయా.. బిత్తరపోయిన తమ్ముళ్లు
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటి నుంచీ.. ఏదో ఒక విధంగా తప్పులో కాలేస్తూ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. మంగళవారం మరోసారి నెటిజన్లకు ఆయన మంచి ముడిసరుకు అందించారు. మంగళవారం దుగ్గిరాల మండలం చింతలపూడిలో జరిగిన సభలో మరోసారి అలాగే మాట్లాడి, టీడీపీ నేతలను, కార్యకర్తలను విస్మయానికి గురిచేశారు.
తన పార్టీ గురించి చేసిందీ, చేయనిదీ చెప్పుకుంటూ.. ‘గతంలో గంజి చిరంజీవి అన్నకు ఇచ్చిన మెజార్టీనే నాకూ ఇచ్చి గెలిపించాలని’ ఓటర్లను కోరారు. అయితే ఈ మాటలు విన్న కార్యకర్తలు, నాయకులు విస్మయానికి గురయ్యారు. చప్పట్లు కొట్టాలో వద్దో అనే సందిగ్ధంలో ఉండగా లోకేశ్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలయిన విషయం తెలిసిందే.