తల నరికినా బీజేపీకి మద్దతివ్వం: హార్దిక్‌

31 Oct, 2017 03:44 IST|Sakshi

అహ్మదాబాద్‌: పటేళ్లకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో రాజ్యాంగ భద్రత కల్పించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించిందని పటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తాను కలిసిలేనని.. అలాగని వారికి వ్యతిరేకమూ కాదని స్పష్టం చేశారు. పటేళ్లకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న అహంకారపూరిత వైఖరికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందన్నారు. అహ్మదాబాద్‌లో గుజరాత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ భరత్‌సింగ్‌ సోలంకితో కలసి పటేల్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘నేను కాంగ్రెస్‌తో కలిసి లేను. అలాగని వారికి వ్యతిరేకమూ కాదు.

కానీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తా. అయితే ఓబీసీ కేటగిరీలో పటేళ్లకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని కాంగ్రెస్‌ వివరించాలి. మీరు ఆకాశం నుంచి తెస్తారా! పాతాళం నుంచి తోడుకొస్తారా! నాకు తెలీదు. నాకు రిజర్వేషన్‌ కావాలంతే’ అని హార్దిక్‌ స్పష్టం చేశారు. ‘మా డిమాండ్లను అధికార పక్షం విననప్పుడు, ప్రతిపక్షంతో మాట్లాడటం మా హక్కు. మా తలలు నరికినా, జైళ్లకు పంపినా ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతివ్వం. 25 ఏళ్లు పటేళ్లు బీజేపీ వెంటే ఉన్నారు. ఇప్పడు మేం వారితో కలసి పనిచేయం’ అని చెప్పారు.

>
మరిన్ని వార్తలు