కుట్ర వెనుక అమరావతి పెద్దల హస్తం
దర్యాప్తులో కుట్ర మొత్తం బయటపడుతుంది
పవన్ వరుస ట్వీట్లు
సాక్షి, హైదరాబాద్ : తనపై కుట్రలు చేస్తున్న మీడియా ఛానెళ్లు.. వాటి అధినేతలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పోరాటం కొనసాగుతోంది. ఈ ఉదయం రవిప్రకాశ్తోపాటు శ్రీని రాజులపై విమర్శలతో విరుచుకుపడిన పవన్.. కాసేపటికే ఓ సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు కోసం తెలంగాణ పోలీసులను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు.
ఈ దెబ్బతో తనను అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్న పురుషులు, మహిళల జాతకాలన్నీ బటయకు వస్తాయని.. అది క్రమంగా అమరావతి వైపు దారితీస్తుందంటూ ఆయన తెలిపారు. ‘ఒకవేళ దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలు, రాజకీయ నాయకులు, మీడియా అధిపతులు, వారి పిల్లలు... అందరూ బయటకు వస్తారు. సమాజంలోని కుళ్లంతా బయటపడుతుంది’ అని పవన్ పేర్కొన్నారు.
‘మీరంతా కలిసి ఓ చెల్లి బట్టలిప్పేలా ప్రొత్సహించారు. దాన్ని మీడియా షో చేసింది. కానీ, దర్యాప్తులో వెలుగు చూసే నిజాలు మీ షోలన్నింటి కంటే పెద్దదే అవుతుంది’ అంటూ వరుస ట్వీట్లు చేశారు. టీడీపీ అనుకూల మీడియా ఛానెళ్లకు.. వాటి అధినేతలకు, భాగస్వాములకు, బోర్డు సభ్యులకు అందిరికీ త్వరలోనే లీగల్ నోటీసులు పంపుతానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. వాటికి స్పందించేందుకు వారికి తగిన సమయం కూడా ఇస్తానని ఆయన ట్వీట్ చేశారు.
పవన్ చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్