ప్రధాన సమస్యలపై స్పందించలేదే?

16 Aug, 2019 07:41 IST|Sakshi

చెన్నై, పెరంబూరు: నటుడు రజనీకాంత్‌పై రాష్ట్రంలోని విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. నటుడు రజనీకాంత్‌ తన రాజకీయ రంగప్రవేశం గురించి ఒక డైలాగ్‌ చెబుతుంటారు. నేను ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో నాకే తెలియదు. అయితే రావలసిన టైమ్‌కు కరెక్ట్‌గా వస్తాను అన్నదే ఆ డైలాగ్‌. ఇప్పుడు దాన్నే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రంగా వాడుతున్నారు. ఆ డైలాగ్‌ను రజనీకాంత్‌ నిజజీవితానికి అన్వయిస్తూ ఎగతాళి చేస్తున్నారు. అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారో?రారో అన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయ్యింది. అందుకు రజనీకాంత్‌ నుంచి సరైన సమాధానం రాలేదు. అయినా అప్పుడప్పుడూ నేనున్నానంటూ ఏదో ఒకటి మాట్లాడి వివాదాలకు తావిస్తున్నారు. అలా రజనీకాంత్‌ ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీని, అమిత్‌షాను కృష్ణార్జులుగా పోల్చడం వివాదానికి తెరలేపింది. కశ్మీర్‌ వ్యవహారంలో మోది,అమిత్‌షా చర్యలను ప్రశంసించారు.దీన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

కశ్మీర్‌ వ్యవహారంలో స్పందించిన రజనీకాంత్‌ రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నాయని, వాటి గురించి ఎందుకు ప్రశ్నించరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ వ్యవహారంలో రజనీకాంత్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఇటీవల కర్ణాటకలో డబ్బు బలంతోనే ప్రభుత్వానికి ధర కట్టి ఆక్రమించేశారు. ఈ విషయమై పలువురు ప్రశ్నించారు. అప్పుడేమయ్యారు రజనీకాంత్‌ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన బీజేపీకి మద్దతు మాత్రమే తెలుపుతున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యదర్శి ముత్తరసన్‌ ఒక ప్రకటనలో పేర్కొంటూ రజనీ అలానే ఉంటారు. ఇలానే చేస్తారు. మోదీని పొగడ్తల్లో ముంచెత్తాల్సిన నిర్బంధంలో ఉన్నారు.అందుకే ఎప్పుడు?ఎలా మాట్లాడాలన్న నిర్బంధానికిగురైయ్యారు అని వ్యాఖ్యానించారు.అదే విధంగా  వీసీపీ పార్టీ నాయకుడు తిరుమావళవన్‌  కశ్మీర్‌ వ్యవహారంపై రజనీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

రూ.40 వేలు పోగొట్టుకున్న అభిమాని
కాగా నటుడు రజనీకాంత్‌ అభిమాని ఒకరు ఆయన్ని చూడడానికి వెళ్లి రూ.40 వేలను పోగొట్టుకున్నాడు. ఆ వివరాలు చూస్తే బుధవారం స్థానిక విల్లివాక్కంకు చెందిన బాలగణపతి అనే వ్యక్తి ప్రయివేట్‌ సంస్థలకు కార్మికులను కమీషన్‌ బేస్‌లో పంపుతుంటాడు. అతను కార్మికులకు వేతనాలు చెల్లించడానికి ఇంటిలోని నగలను తాకట్టు పెట్టి రూ.40 వేలను తీసుకుని తన కార్యాలయానికి బయలు దేరాడు. మధ్యలో స్నేహితుల నుంచి ఫోన్‌ వచ్చింది. చెన్నైలోని కలైవానర్‌ ఆవరణలో జరుగుతున్న  కార్యక్రమానికి నటుడు రజనీకాంత్‌ వచ్చారని, తామాయన్ని చూడడానికి వెళుతున్నాం, నువ్వు రా అని పిలిచారు. దీంతో రజకాంత్‌ను చూడాలన్న ఆసక్తితో తన వద్ద ఉన్న డబ్బు సంచితోనే వెళ్లాడు. అక్కడు తన చేతిలోని ఫోన్‌తో రజనీకాంత్‌ను వెంటపడి ఫొటోలు తీసుకున్నాడు. ఆ పని ముగిసిన తరువాత చేతిలో డబ్బు సంచి లేదన్న విషయం తెలిసింది. దీంతో లబో దిబో అంటూ ట్రిప్లికేన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు