పోట్లదుర్తి బ్రదర్స్‌ అరాచకం

13 Apr, 2019 14:09 IST|Sakshi
పోట్లదుర్తిలో సీఐతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ íసీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి (ఇన్‌సెట్‌) ఆవేదన వ్యక్తం చేస్తున్నవైఎస్సార్‌సీపీ ఏజెంటు రామ్మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ రామ్మోహన్‌రెడ్డి ఇంటికి తాళం వేయించిన ఎంపీ రమేష్‌

పోలింగ్‌ బూత్‌లో మాకే వ్యతిరేకంగా కూర్చుంటావా అని బెదిరింపు

ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పత్రాలు కూడా పోట్లదుర్తి బ్రదర్స్‌ వద్దనే  

బాసటగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎం. సుధీర్‌రెడ్డి

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలోని పోట్లదుర్తి బ్రదర్స్‌ ఎంపీ రమేష్‌ , సురేష్‌నాయుడుల అరాచకం ఎక్కువైందని,   వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని బెదిరిస్తూ..భయపెడుతున్నారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఎన్నికల రోజున వైఎస్సార్‌సీపీ తరుపున 248 పొలింగ్‌ కేంద్రం ఏజెంటుగా కుర్చున్న దివ్యాంగుడు సంగాల రామ్మోహన్‌రెడ్డి టీడీపీ వారి నకిలీ ఓటర్లను అడ్డుకున్నాడు. దీంతో ఎంపీ రమేష్, సురేష్‌లు బెదిరించి రామ్మోహన్‌రెడ్డి ఇంటికి  తాళం చేసి కాలి చేసి వెళ్లిపోవాలని భయపెట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త , అసెంబ్లీ అభ్యర్థి డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి గ్రామానికి వెళ్లి వెంటనే రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వేసిన తాళం తీయించాలని లేకపోతే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంటుందని పోలీసులకు చెప్పారు. అనంతరం టీడీపీ వారు వేసిన తాళం తీసి వేశారు. ఈ విషయంపై  దివ్యాంగ బా«ధితుడు సంగాల రామ్మోహన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పోట్లదుర్తి గ్రామంలో 2002 సంవత్సరంలో తన తల్లి చెన్నమ్మ పేరు మీద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసిందన్నారు.

అందుకు సంబంధించిన పత్రాలు  ఇవ్వకుండా టీడీపీ నేత సురేష్‌నాయుడు వద్దనే ఉంచుకున్నారని చెప్పారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  గ్రామంలోని 248 పొలింగ్‌  కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ తరుపున ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి తరుపున ఏజెంట్‌గా కూర్చున్నానని చెప్పారు. సాయంత్రం సమయంలో టీడీపీ వారు నకిలీ ఓటర్లును పంపించారని, ఆ నకిలీ ఓట్లును అడ్డుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఆదే బూత్‌లో ఉన్న ఎంపీ రమేష్‌ అనుచరుడు గొవింద పక్కనే ఉన్న టీడీపీ ఏజెంట్‌తో ఫోన్‌ చేయించి మీ ఇంటికి తాళం వేస్తున్నారని బెదిరించారన్నారు. అయినా భయపడకుండా 13 నకిలీ ఓటర్లును అడ్డుకొని బయటకు పంపించినట్లు చెప్పారు. మా అమ్మ చెన్నమ్మ పేరు మీద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసినా ఆ ఇంటి పత్రాలు మాకు ఇవ్వకుండా సురేష్‌నాయుడు వద్దనే ఉంచుకున్నారు. వారికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇలా బెదిరింపులకు దిగుతారని చెప్పారు. సురేష్‌నాయుడు గతేడాది కూడా మా అక్క, బావను ఇంటి వద్దకు పిలిపించుకొని చిత్రహింసలు పెట్టి కొట్టారన్నారు.   అప్పటి నుంచి నేను వారికి వ్యతిరేకంగా ఉండి వైఎస్సార్‌ సీపీ తరుపున ఈ ఎన్నికలలో ఏజెంట్‌గా కూర్చున్నట్లు తెలిపారు. పోట్లదుర్తి బ్రదర్స్‌ అరాచకాలను నుంచి మమ్మల్ని కాపాడి మా ఇంటి పత్రాలు మాకు ఇప్పించాలని పోలీసులను కోరారు. అ కాలనీలో నివాసం ఉంటున్న అందరి పరిస్థితి కూడా ఇలానే ఉందన్నారు.

మా పార్టీ కార్యకర్తకు ఏదైన జరిగితే ఊరుకోం
వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామ్మోహన్‌రెడ్డికి ఏదైన జరిగితే చూస్తే ఊరుకోమని వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలుసుకుని శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లి శివాలయంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్‌రెడ్డితో కలసి పూజలు నిర్వహించారు. అప్పటికే ఎర్రగుంట్ల సీఐ వెంకటరమణ  ప్రత్యేక పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. రామ్మెహన్‌రెడ్డి ఇంటికి వేసిన తాళం వెంటనే తీయాలని సీఐకి చెప్పారు. గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్‌ అరాచాలతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఒక్కసారి ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తే ఆ ఇంటిపై హక్కు బాధితులకు ఉంటుంది తప్ప  పోట్లదుర్తి బ్రదర్స్‌ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు