శివసేన గూటికి చతుర్వేది

20 Apr, 2019 03:25 IST|Sakshi
ప్రియాంక చతుర్వేది, ఉద్దవ్‌ ఠాక్రే

న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం ఆ పార్టీని వీడారు. ఆ వెంటనే ఉద్దవ్‌ ఠాక్రే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. చతుర్వేది కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి, వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి పంపారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా, మీడియా విభాగం ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. పార్టీలో కొందరు నాయకులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొద్ది వారాలుగా తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆమె కొద్దిరోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని అధిష్టానం సస్పెండ్‌ కూడా చేసింది. అయితే, ఆ పార్టీ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య జోక్యంతో ఇటీవల వారిని మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌లో తన సేవలకు విలువలేదని, అందుకే పార్టీని వీడుతున్నానని రాహుల్‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ప్రియాంక చతుర్వేదిని ఉద్దేశించి ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడుతూ శివసేన కార్యకర్తలకు మంచి సోదరి లభించిందని అన్నారు. తన స్వస్థలం ముంబై అని, అందుకే శివసేనలో చేరానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు రక్షణలేదని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు.

మరిన్ని వార్తలు