ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాలజోన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏక పక్షంగా వైఎస్సార్సీపీకి పట్టం కట్టారని, ప్రజాపాలనలో వైఎస్.జగన్మోహన్రెడ్డి దేశానికి ఆదర్శం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆకాంక్షించారు. జగిత్యాలలో ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను దక్కించుకున్న వైఎస్ జగన్కు అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనను ఇప్పటికీ ప్రజలు మర్చిపోవడం లేదని గుర్తు చేశారు. పాదయాత్రతో వేలాది కిలోమీటర్లు నడవడం కాకుండా, ప్రజా సమస్యలను దగ్గర నుంచి చూడటం వల్లనే ప్రజలు ఎన్నికల్లో జగన్కు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. జగన్కు ఉన్న ధైర్యం, పట్టుదలతోనే అనేక కష్టాలను ఎదుర్కొని ఏళ్ల తరబడి ప్రజల తరఫున నిలబడ్డాడని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ తరఫున నిలబడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మంత్రివర్గంలో ఓ మంత్రిగా తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.