నారాయణఖేడ్: టీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మంత్రి హరీశ్రావు ఒక్కరే గెలుపొందుతారని, కేసీఆర్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
కేసీఆర్ గజ్వేల్ను వీడి ఏదైనా వేరే ప్రాంతం చూసుకోవాలని, లేదంటే పోటీచేయకపోవడమే మంచిదని హితవు పలికారు. తాను కుంతియా ను కలిసినట్టు టీఆర్ఎస్ నేతలు నిరాధారంగా ఆరోపిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో 70 శాతానికిపైగా గుడ్డిగుర్రాలే అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ 25 నుంచి 30 స్థానాలు గెలిస్తే ఎక్కువన్నారు. కేసీఆర్ కుమారుడు నియంతలా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా పోటీచేయనని స్పష్టం చేశారు.