టిక్కెట్‌ కోసం బస్సులో ఢిల్లీకి

12 Nov, 2018 13:36 IST|Sakshi

లంబాడి మహిళలతో బస్సులో రాహుల్‌ నివాసానికి వెళ్లిన రవీంద్ర నాయక్‌

దేవరకొండ సీటు తనకే ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం నేతల పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ హోరాహోరీగా సాగుతోంది. కొంతమంది నేతలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద ఆందోళనకు దిగగా.. మరికొందరు ఢిల్లీలో స్ర్కీనింగ్‌ కమిటీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ టిక్కెట్‌ కోసం వినుత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం ఢిల్లీలోని రాహుల్‌ నివాసానికి లంబాడి మహిళతో బస్సులో వెళ్లి  ఆయనను కలిశారు. తనకు దేవరకొండ టిక్కెట్‌ ఇవ్వాలని రాహుల్‌ వద్ద డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అభ్యర్థుల పేర్లు నేడోరేపో తేలే అవకాశం ఉన్నా.. నేతల మాత్రం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియాలు రాహుల్‌తో భేటీ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నేత మణెమ్మ రాహుల్‌ నివాసం వద్ద ప్లకార్డులు ప్రదర్మించారు. ఆమె నాగర్‌ కర్నూల్‌ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఆ టిక్కెట్‌ను కేటా‍యించాలని రాహుల్‌ నివాసం వద్ద నిరసనకు దిగారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టిక్కెట్‌ తనకే ఇవ్వాలని ఆపార్టీ సీనియర్‌ నేత విజయ రామారావు డిమాండ్‌ చేశారు. వరంగల్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న ఆశోక్‌గౌడ్‌ కూడా ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు