పాఠ్య పుస్తకాలు ఎప్పుడిస్తారు?

25 Jun, 2018 12:30 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

పాతపట్నం: విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పాఠశాలలు ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోవడమే ఇందుకు నిదర్శమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలను అందజేయాల్సి ఉన్నా పాలకులు నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. పుస్తకాలు అందజేయకపోతే పాఠాలు బోధిస్తారని ఆమె ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్‌లు, సమావేశాలు ఏర్పాటు చేసి సమయాన్ని వృథా చేయడమే తప్ప ఇంత వరకు పుస్తకాలు, యూనిఫాం అందజేయలేదన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు