బీజేపీతో స్నేహానికి శాశ్వత ముగింపు

19 Nov, 2019 12:52 IST|Sakshi

ఎన్డీయేకు పునాది వేసింది బాలాఠాక్రే

సేన ఎంపీలను ప్రతిపక్షంలో కూర్చోబెడతారా?

బీజేపీ తీవ్రంగా అవమానించింది: శివసేన

సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో బీజేపీ-శివసేన మధ్య ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పదవుల పంపకాలతో ప్రారంభమైన వీరి మనస్పర్థలు కూటమి విచ్ఛినం వరకూ వెళ్లాయి. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన శివసేన వారి విజ‍్క్షప్తి మేరకు కేంద్రమంత్రి పదవి కూడా రాజీనామా చేసింది. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లయింది. తాజాగా పార్లమెంట్‌ సమావేశాలు వారి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. 30 ఏళ్లకు పైగా ఉన్న ప్రయాణానికి పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లయింది. సోమవారంతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో చర్చలో భాగంగా శివసేనకు ప్రతిపక్షం వైపు సీట్లను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఆదివారమే ప్రకటించారు. మొన్నటి వరకు అధికారపక్షం వైపు కూర్చున సేన ఎంపీలు.. తాజాగా ప్రతిపక్షంలో కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కావచ్చు.

ఈ నేపథ్యంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం సామ్నాలో ఎడిటోరియల్‌ వేదికగా శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం తమను సంప్రదించకుండానే విపక్ష వైపు తమ స్థానాలను మార్చారని విమర్శించింది. ‘ఎన్డీయే ఏర్పడటానికి ముఖ్య కారణం దివంగత బాలాసాహెబ్‌ ఠాక్రే. ఆ నాడు హిందుత్వ, జాతీయవాదం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు మర్చిపోవడం దారుణం. ఎన్డీయే ఏర్పడిన తొలి నాళ్లలో బీజేపీతో కలసి రావడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. తొలుత బీజేపీతో భాగస్వామ్యం అయిన పార్టీ శివసేన. తాజా పరిస్థితుల నేపథ్యంలో మాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ఇంత జరిగాక బీజేపీతో మళ్లీ మేం కలవడంలో అర్థంలేదు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడినా.. బీజేపీతో కలిసేందుకు మేం సిద్ధంగా లేం. బాలా సాహెబ్‌ వర్థంతి సందర్భంగా యావద్దేశమంతా ఆయకు నివాళి అర్పించింది. కానీ అదే రోజున ఆయన  పునాది వేసిన ఎన్డీయే నుంచి శివసేనను బహిష్కరించడం బాధాకరం. అవమానకరం. ఇక నో బీజేపీ, నో ఎన్డీయే’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది.

కాగా ఎన్నికల ఫలితాలు ఏర్పడి నెల రోజులు కావస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ వెనక్కి తగ్గడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతో సీఎం పీఠం అధిష్టించాలని శివసేన భావించింది. ఈ మేరకు మూడు పార్టీ మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నా.. ముంగింపు దశకు మాత్రం చేరుకోవడంలేదు. రోజుకో ప్రకటన చేస్తూ కాలం గడుపుతున్నారేతప్ప.. ఓ అంగీకారానికి మాత్రం రావడంలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందన్న కారణంతో రాష్ట్రపతి పాలన విధించారు. కానీ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ చర్చలు మాత్రం ఓ వైపు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభకావడంతో వారి ప్రయత్నలు మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు