పదవుల పంపకాలపై వాడీవేడి చర్చలు

11 Nov, 2019 13:51 IST|Sakshi

కొలిక్కి వస్తున్న మహారాష్ట్ర ప్రతిష్టంభన

ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ.. స్థానిక నేతలకు పిలుపు

కీలక పదవులను ఆఫర్‌ చేస్తున్న శివసేన

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడ్డ ప్రతిష్టంభన ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కి అసెంబ్లీ స్పీకర్‌ వంటి కీలక పదవులను శివసేన ఆఫర్‌ చేసినట్లు ముంబై రాజకీయ వర్గల సమాచారం. అయితే దీనిపై శివసేన నుంచి ఇంకా అధికారిక ‍ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు శివసేన నేతలు ‍ప్రకటించారు. ఇరు పార్టీల నేతలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సేన నేతలు తెలిపారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌.. శివసేనకు మద్దతు ప్రకటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ అధినేత త్వరలోనే తుదినిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు.

శివసేననకు మద్దతు అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన భేటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. సేనకు మద్దతు, ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. అయితే సమావేశంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. భేటీ అనంతరం మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా సోనియా కబురుపంపారు. దీనిపై సోమవారం సాయంత్రం వారితో మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నిర్ణయం కోసం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఎదరుచూస్తున్నారు. సోనియాతో భేటీ తరువాతమే తుది నిర్ణయం ప్రకటిస్తామని పవార్‌ ప్రకటించారు. మరోవైపు తమ నిర్ణయం తెలపటానికి శివసేనకు గవర్నర్‌ ఇచ్చిన సమయం దగ్గర పడుతుండటంతో ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఢిల్లీ కేంద్రంగా రహస్య మంతనాలు జరుపుతున్నారు. మరింత వేగంగా వ్యూహాలకు పదుపుపెడుతున్నారు. అయితే సోమవారం సాయంత్రం లోగ  ప్రభుత్వ ఏర్పాటులో ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే భేటీ అవుతారని సమాచారం.

మరిన్ని వార్తలు