వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్దరామయ్య

6 May, 2019 20:43 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ నాయకులను ఉద్దేశిస్తూ.. ‘కాపలదార్లం అని ప్రచారం చేసుకునే బదులు.. పిచ్చి వాళ్లం’ అని ప్రచారం చేసుకొండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ప్రధాని మోదీ నుంచి ఈశ్వరప్ప వరకూ ప్రతి బీజేపీ నాయకుడి మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనపడుతుందన్నారు సిద్దరామయ్య. ఓటమి ఆలోచనలతో మతి స్థిమితం కోల్పోయారు కాబట్టే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. సిద్దరామయ్య ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి కారణం బీజేపీ నాయకుడు ఈశ్వరప్ప.

ఇంతకు ఏం జరిగిందంటే..  కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో ఓ ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ.. ‘అవును అత్యాచారం జరిగింది.. ఇప్పుడు దానికి ఏం చేయాలి’ అంటూ చాలా  నిర్లక్ష్యంగా స్పందించారు. సిద్దరామయ్య తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమయ్యింది. దాంతో బీజేపీ నాయకుడు ఈశ్వరప్ప.. ‘చిన్నారిపై జరిగిన దారుణం పట్ల ఓ మాజీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు చాలా బాధాకరంగా ఉంది. అదే ఆ చిన్నారి స్థానంలో సిద్దరామయ్య మనవరాలు ఉంటే.. అప్పుడు కూడా ఆయన ఇలానే స్పందించేవారా’ అని ప్రశ్నించారు. అప్పుడు మొదలైన ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు.

తాజాగా ఈశ్వరప్ప వ్యాఖ్యలపై స్పందించిన సిద్దరామయ్య.. ‘ఓటమి భయంతో బీజేపీ నాయకులకు మత్రి భ్రమించింది. ఏం మాట్లాడుతున్నారో వారకే అర్థం కావడం లేదు. వారికి నా విన్నపం ఒక్కటే.. ప్రజల క్షేమం కోసం మీరు ఓ పని చేయండి. కాపలదార్లమంటూ ప్రచారం చేసుకునే బదులు.. పిచ్చి వాళ్లం అని చెప్పుకొండి’ అంటూ విమర్శించారు.

>
మరిన్ని వార్తలు