‘బాబర్‌, ఔరంగజేబుగా పేరు మార్చుకో’

5 May, 2019 13:41 IST|Sakshi

ఏచూరిపై మండిపడ్డ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

హిందు ధర్మంపై నమ్మకంలేకపోతే పేరు మార్చుకో

సాక్షి, ముంబై: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన పేరు మార్చుకుంటే మంచిదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సూచించారు.  రామాయణ, మహాభారతాలు మొత్తం హింసతో నిండి ఉన్నాయని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ ధర్మపై నమ్మకం​ లేనప్పుడు ఆయనకు సీతారాం అనే పేరేందుకని .. బాబర్‌‌, చెంగిఛ్‌ఖాన్‌, ఔరంగజేబుగా పేరు మార్చుకుంటే బాగుంటుందని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు. రాముడిపై నమ్మకం లేని వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

‘హిందువులు హింసాత్మకంగా ఉంటారనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? రామాయణం, మహాభారతాలు ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి. ఎప్పటికైనా చెడు మీద మంచి గెలుస్తుందనేదే దాని సందేశం. రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంతా సత్యానికి సంకేతాలు. రామాయణ, మహాభారతాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు.. రేపు పాకిస్తాన్ మీద భారత సైనికుల పోరాటం కూడా హింసాత్మకం అంటారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను ఎదుర్కోవడం కూడా హింసేనా?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. హిందువులను ఎటాక్ చేయడమే ఆయన విధానమని.. ఆ విధంగా తనను తాను సెక్యులర్‌గా గుర్తింపు పొందాలని తాపత్రయం పడుతున్నారని  సంజయ్ అన్నారు.

ఇదిలావుండగా  ఏచూరి వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ.. యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా హరిద్వార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏచూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోపాలో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సీతారం ఏచూరి పలు వివాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రామాయణ ,మహభారతం లు రెండు కూడ యుద్దాలతోపాటు హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయని అన్నారు. హిందు ప్రచార వాదులు చెబుతున్నట్టుగా హిందువులు హింసను ప్రోత్సహించే వారు కాదని చెప్పగలరా అని ఏచూరి ప్రశ్నించారు. మరోవైపు హిందువుల ఓట్ల కోసం బీజేపీ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న సాధ్విని పోటిలోకి దింపిందని ఏచూరి ఆరోపించారు.

మరిన్ని వార్తలు