చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం భ్రష్టుపట్టింది

17 Jul, 2018 12:50 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత సోము వీర్రాజు 

శ్రీకాకుళం రూరల్‌ : జిల్లాకు ఫిషరీస్‌ యూనివర్సిటీ తీసుకొస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ సో ము వీర్రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం మంజూరు చేసిన పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి పథకాలుగా మారిపోయాయని అన్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రాష్ట్రానికి రూ.30వేల కోట్లు వచ్చాయంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు కేం ద్రం రైతులకు మద్దతు ధర ప్రకటించిందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు తినేస్తూ, మళ్లీ కేంద్రాన్నే తిట్టడం చంద్రబాబు నైజమన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యం, ఉపాధికి తూట్లు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా గల 3,500 పాఠశాలలకు సంబంధించి విద్యను అభివృద్ధి చేసేందుకు రూ.120 కోట్లు మంజూరు చేస్తే అందులో రూ. 30 కోట్ల నిధుల దోపిడీ జరిగిందన్నారు.

ప్రభుత్వ విద్యను బాగు చేయాల్సింది పోయి ప్రైవేటు సం స్థలకు పల్లకీలు మోయడం బాబుకు తగదన్నారు. దీనిపై అసెంబ్లీలోనూ ప్రస్తావించకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకతతోనే జగన్‌ పాదయాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రూ.1500 కోట్లతో మొక్కలు నాటే పెంపకం చేపట్టారని ఆ డబ్బులతో యువతకు, యువజన సం ఘాలకు, ఎన్‌జీఓ సంఘాలకు మొక్కలు అందజేసి అవి పెరిగి పెద్దదైతే డబ్బులు ఇస్తామని చెబితే కొంతవరకైనా నిరుద్యోగ సమస్య తీర్చవచ్చునన్నారు.

సమావేశంలో బీజేపీ నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యులు సువ్వారి వెంకట సన్యాసిరావు, పూడి తిరుపతిరావు, కోటగిరి నారాయణరావు, చల్లా వెంకటేశ్వరరావు, శవ్వాన ఉమా మహేశ్వరి, ఎస్‌.వెంకటేశ్వరరావు, సువ్వారి రాజేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

‘వైఎస్‌ కృషితోనే పోలవరానికి అంకురార్పణ’

టెక్కలి: ఎంగిలి కాఫీ తాగే వారిలో చంద్రబాబు లాంటి ఘనుడు మరొకరు లేరని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం టెక్కలిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

ఈ రోజు ముఖ్య మంత్రి చంద్రబాబు ఇస్తున్న పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘనత వల్లనే పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందన్నారు. 

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ఎందుకు గుర్తు రాలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రన్న బీమాకు కేంద్రం 5 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని, అయితే అది తన గొప్పతనంగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

నీరు–చెట్టు పథకంలో భాగంగా ఎలాంటి పనులు చేయకుండా సుమారు 13 వేల కోట్ల రూపాయల మేరకు బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. ఏపీలో విద్య కోసం కేంద్రం నిధులిస్తే చంద్రబాబు మాత్రం నారాయణ, చైతన్య అంటూ భజనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ లాంటి అవినీతి పార్టీ మరొకటి లేదని ఆయన అన్నారు.  

మరిన్ని వార్తలు