‘జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు’

12 Feb, 2019 12:21 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ జెండా పట్టుకోకపోతే పాతాళానికి తొక్కేస్తా అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివను.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌ కూన రవి కుమార్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోన్‌ ఆడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. రవి బెదిరింపుల పట్ల ఆమదాలవలస, పొందూరులలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కూన రవిపై కేసు నమోదు చేయాలని పొందూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అధ్వర్యంలో పోలీసు స్టేషన్‌ ముందు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని రవిని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తకు, అభిమానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూన రవి కుమార్‌ పద్దతి మార్చుకోకపోతే జనమే ఆయన్ని పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు. (టీడీపీ జెండా పట్టుకో లేదంటే.. వెంటాడి వేటాడుతా)

మరిన్ని వార్తలు