మా ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకుంటాం..

12 Apr, 2019 09:05 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడికి పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలను వారిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌) దాడితో గాయపడిన మాజీ సర్పంచ్‌ వకీద

సాక్షి, యల్లనూరు: ‘మీరు ఎందుకు వచ్చారు ఓటు వేయడానికి..? అంతా మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం.. అన్నీ మేమే (ఓట్లు) వేసుకుంటాం’ అంటూ టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. యల్లనూరు మండలం జంగంపల్లిలో ఓటు వేయడానికి తమ వారితో కలిసి వెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులను టీడీపీ ఏజెంటు ఈవీఎంల వద్దకు తీసుకెళ్లి సైకిల్‌ గుర్తుకు వేయించాడు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతే రెచ్చి పోయిన టీడీపీ ఏజెంట్, కార్యకర్తలు దుర్భాషలాడారు.

ఇంతలో ఓటు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ భర్త సంజన్న కూడా విషయం తెలుసుకుని టీడీపీ వారి తీరును తప్పుపట్టారు. మా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాం అంటూ సంజన్పపై దాడిచేశారు. పోలింగ్‌ కేంద్రం బయట ఉన్న సంజన్న భార్య, మాజీ సర్పంచ్‌ వకీదతో పాటు మరొక వైఎస్సార్‌సీపీ కార్యకర్తపైనా దాడి చేసి గాయపరిచారు. సమాచారం తెలియగానే జెడ్పీటీసీ కొత్తమిద్దె వెంకటరమణ, ఎంపీటీసీ బోగాతి ప్రతాప్‌రెడ్డి జంగంపల్లికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కొత్తమిద్దె వెంకటరమణ, బోగాతి ప్రతాప్‌రెడ్డిలు గ్రామంలోకి వచ్చారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కట్టెలు, రాళ్లు తీసుకుని మరోసారి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  
ఒక్క రోజు ఆగండి.. 
జంగంపల్లిలో జరిగిన ఘర్షణ గురించి తెలుసుకున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను కలుసుకున్నారు. ఎంపీతో పాటు టీడీపీ చోటా నాయకులు మాట్లాడుతూ ‘మీరు ఒక్క రోజు ఆగండి.... మర్నాడు వైఎస్సార్‌సీపీ వాళ్ల కథ ఏందో చూద్దాం’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.   

మరిన్ని వార్తలు