2019 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవదు..

2 May, 2018 19:56 IST|Sakshi

సాక్షి, తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఎండగట్టారు. చంద్రబాబు తిరుపతిలో చేసింది అధర్మ దీక్ష అని ఆయన విమర్శించారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విష్ణుకుమార్‌ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడటం లేదు. పోలవరం ప్రాజెక్టు నిధులు సరిపోవడం లేదని చెప్పడం దారుణం. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటానికి ఆదరణ వస్తుండటంతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగువాళ్లు ఓటు వేయవద్దని చంద్రబాబు చెప్పడం సరికాదు. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకోకుండా యూటర్న్‌ తీసుకున్న ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచారు.

చంద్రబాబు సైకోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి వల్లే బ్రిటిష్‌ వారితో టీడీపీ పోరాటం చేసిందంటూ తిరుపతి సభలో చెప్పారు. అన్ని వర్గాలను మభ్యపెడుతున్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీని విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, వైఎస్సార్‌ సీపీ, జనసేన పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తాయి. ఇప్పటివరకూ ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవదు.’ అంటూ జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు