భువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు..

12 Dec, 2018 10:50 IST|Sakshi
భువనగిరి : ఓట్ల లెక్కింపులో పాల్గొన్న అధికారులు

టీఆర్‌ఎస్‌కే బహ్మరథం

భువనగిరి, ఆలేరు, తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌ గెలుపు

మునుగోడు, నకిరేకల్‌లో  కాంగ్రెస్‌ విజయం

సాక్షి, యాదాద్రి : యాదాద్రిభువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు ఎగిరింది. ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండాకు వందనం చేస్తున్న భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మరోసారి జెండాను రెపరెపలాడించారు. ప్రజాకూటమికి ప్రజల అంగీకారం లభించలేదు. నిశ్శబ్ద విప్లవంలా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలకు ఆమోదం తెలుపుతూ కారు గుర్తుకు ఓట్లు వేశారు. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఆపార్టీ అభ్యర్థులు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి  విజయం సాధించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదముద్ర వేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సాగు, తాగునీటితోపాటు రైతుబంధు, ఆసరా పింఛన్‌లు, 24గంటల విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, గొర్రెల, చేపల పంపిణీ వంటి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక దిశలో తీవ్ర పోటీ ఇస్తుందనుకున్న ప్రజాకూటమి భారీ ఓటమి  మూటగట్టుకుంది. 

తొలిరౌండ్‌ నుంచే ఆధిక్యత
భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తొలిరౌండ్‌ నుంచే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోయారు. భువనగిరిలో 18రౌండ్లు, ఆలేరులో 22రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. భువనగిరి లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిపై 24,063ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే లెక్కింపులో భువనగిరి, భువనగిరిపట్టణం, బీబీ నగర్, పోచంపల్లి మండలాల్లో టీఆర్‌ఎస్‌కు సం పూర్ణ ఆధిక్యత లభించింది. పోచంపల్లి మండలం లో 16రౌండ్లలో ఆధిక్యత నిలుపుకోగా 17, 18 రౌండ్లలో వలిగొండ మండలంలో కాంగ్రెస్‌కు ఆధిక్యత లభించింది. ప్రజాకూటమి అభ్యర్థిగా పో టీ చేసిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి 61413 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు 33,560 ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్‌కు టీడీపీ, సీపీ ఐ, టీజేఎస్‌ పొత్తుతో పోటీలో నిలిచింది. అయితే ఆపార్టీకి గణనీయంగా 27, 853 ఓట్లు పెరిగాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన యువతెలంగాణ అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డికి 13,427ఓట్లు లభిం చాయి.గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి  39,179ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలి చిన ఆయన ఈఎన్నికల్లో మూడోస్థానంతో సరిపె ట్టుకున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పోచంపల్లి రమణరావుకు 3,613 ఓట్లు రాగా, సీపీఎం తరపున పోటీ చేసిన కల్లూరి మల్లేశంకు 1856 ఓట్లు వచ్చాయి. ఆతర్వాత స్థానాల్లో ఆలకుంట్ల ఎల్లయ్య 1758, దేవరకొండ హన్మంతు 1305 ఓట్లు లభించాయి. నోటాకు 1347 వచ్చాయి. ఇం డిపెండెంట్‌ అభ్యర్థులు 1000లోపు ఓట్లు సాధించారు. 

‘గొంగిడి’ రెండోసారి
ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి రెండోసారి విజయాన్ని  సాధించారు. ఆమెకు 94, 870ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌కు 61,784 ఓట్లు రావడంతో  గొంగిడి సునీత  కాంగ్రెస్‌ అభ్యర్థిపై  33, 086 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో 31,389ఓట్లతో గొంగిడి సునీత కాంగ్రెస్‌ అభ్యర్థి భిక్షమయ్యగౌడ్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భిక్షమయ్యగౌడ్‌కు 60,150ఓట్లు వచ్చాయి. గొంగిడి సునీతకు 91,539ఓట్లు వచ్చాయి. 31389మెజార్టీతో గెలి చారు. అయితే ఈఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ తరఫున పోటీ చేసిన ఇండిపెండెంట్‌ అభ్యర్థి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు 10,473ఓట్లతో తృతీయ స్థానంలో నిలి చారు. బీఎస్పీ తరఫున పోటీ చేసిన కల్లూరి రామచంద్రారెడ్డి 11,921ఓట్లను, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి 4,967ఓట్లను సాధించారు. పోటీలో ఉన్న మరో 9మంది ఇండిపెండెంట్లకు 5999 ఓట్లు లభించాయి. కాగా నోటాకు 1465మంది ఓటు వేసి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరినీ అంగీకరించలేదు.  

ఫలించని కూటమి ప్రయత్నాలు
భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కూటమి ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ల కూటమిలో కాంగ్రెస్‌ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయింది. అయితే కూటమి ఓటు బదిలీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడంతో అధికార పార్టీకి లబ్ధి చేకూరగా, కూటమికి ఓటమి తప్పలేదు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌కు 2014 ఎన్నికల్లో 60,150 ఓట్లు రాగా ఇప్పుడు కూటమి అభ్యర్థిగా 61,784 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 1634 ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. కచ్చితమైన ఓటు బ్యాంకు కలిగిన కూట మిలోని పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు ఏమైయ్యాయన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకీ చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఎల్‌ఎఫ్‌ తరఫున ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగడంతో టీడీపీకి చెందిన ఓట్లు ఆయనకు బదిలీ అయ్యాయని ఆ పార్టీ నేతలు అంతర్మథనంలో ఉన్నారు. మోత్కుపల్లితో పాటు  బీఎస్‌పీ అభ్యర్థి కల్లూరి రామచంద్రారెడ్డి, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి 27,361 ఓట్లను, ఇండిపెండెంట్లు 5999 ఓట్లు పొందారు. దీంతో వీరందరికీ  33,360 ఓట్లు వచ్చాయి. కూటమి అభ్యర్థి, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్లన్ని కలిపితే టీఆర్‌ఎస్‌ మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్నాయి. 

నియోజకవర్గం : ఆలేరు
2018లో విజేత : గొంగిడి సునీత (టీఆర్‌ఎస్‌) వచ్చిన ఓట్లు: 94870
ప్రత్యర్థి:  బూడిద భిక్షమయ్యగౌడ్‌ (కాంగ్రెస్‌) వచ్చిన ఓట్లు: 61784
మెజార్టీ: 33086
2014 ఎన్నికల్లో : విజేత గొంగిడి సునీతకు వచ్చిన ఓట్లు : 91,539
ప్రత్యర్థి: బూడిద భిక్షమయ్యగౌడ్‌కు వచ్చిన ఓట్లు :  60150
మెజార్టీ : 31389

నియోజకవర్గం: భువనగిరి
2018లో విజేత: పైళ్ల శేఖర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌) వచ్చిన ఓట్లు: 85,476
ప్రత్యర్థి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి వచ్చిన ఓట్లు:61413
మెజార్టీ: 24,063
2014 ఎన్నికల్లో విజేత :పైళ్ల శేఖర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 54,347
ప్రత్యర్థి :జిట్టా బాలకృష్ణారెడ్డి(స్వతంత్ర) వచ్చిన ఓట్లు: 39,179
మెజార్టీ: 15,168

మరిన్ని వార్తలు