సీఏఏపై ఊర్మిళ సంచలన వ్యాఖ్యలు

31 Jan, 2020 16:32 IST|Sakshi

సాక్షి, ముంబై : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకురాలు, రంగీలా ఫేమ్‌ ఊర్మిళ మటోండ్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ చట్టాన్ని బ్రిటీషర్లు ప్రవేశపెట్టిన రౌలత్‌ చట్టంతో పోల్చారు. ఈ చట్టాన్ని నల్ల చట్టంగా ఆమె అభివర్ణించారు. మహాత్మా గాంధీ వ‍ర్థంతి సందర్భంగా గురువారం ముంబైలో ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఊర్మిళ మాట్లాడుతూ.. సీఏఏ చట్టాన్ని తప్పుబట్టారు. బ్రిటీషర్లు దేశాన్ని వదలివెళ్లిన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దేశంలో అశాంతిని రేకెత్తించటానికి రౌలత్ చట్టం లాగే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. నల్లచట్టాల సరసన సీఏఏకు కూడా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీ మన దేశానికే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికి ఆదర్శమైన మహనాయుడని అన్నారు. ప్రజలంతా గాంధీజీ బాటలో నడవాలని.. కానీ గాంధీ ఆశయాలను తూట్లు పొడిచేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. గాంధీజీని హతమార్చిన నాథూరాం గాడ్సే ముస్లిం, సిక్కు వర్గానికి వ్యక్తి కాదని.. ఆయన హిందువు అన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆమె.. ముంబై నార్త్‌ లోక్‌సభ నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.
 

మరిన్ని వార్తలు