యూపీ ‘9వ అభ్యర్థి’ ఆశలపై నీళ్లు!

19 Mar, 2018 04:07 IST|Sakshi

లక్నో: యూపీ రాజ్యసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి చెందిన తొమ్మిదో అభ్యర్ధి విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ ఆదివారం చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. 23వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకుగాను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సహా తొమ్మిది మందిని బీజేపీ బరిలోకి దించింది.

బీజేపీ సంఖ్యాబలం ప్రకారం 8మంది గెలుపు ఖాయం కాగా 9వ అభ్యర్ధి విజయానికి ఎస్‌బీఎస్పీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లే కీలకం కానున్నాయి.   ‘మేం అధికార కూటమి పార్టీగా కొనసాగుతున్నాం. అయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల విషయం బీజేపీ మాతో చర్చించలేదు. వారి వద్దకు మేమే వెళ్లి మీకు ఓట్లేస్తాం అని చెప్పాలా? బీజేపీకి ఓటేసే విషయం చర్చించి నిర్ణయిస్తాం’ అని ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ విలేకరులతో అన్నారు.

>
మరిన్ని వార్తలు