‘కుట్ర ప్రకారమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం’

23 Jan, 2019 16:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కుట్ర ప్రకారమే జరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చడానికే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుపడుతుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్‌ఐఏ విచారణలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ పాత్ర బయటకు వస్తుందనే భయం కనిపిస్తోందని ఆరోపించారు. అందుకే సిట్‌ దర్యాప్తు మాత్రమే ఫైనల్‌ కావాలనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోందన్నారు

ఎన్‌ఐఏ విచారణను ఆపేందుకు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాశారని తెలిపారు. ఈ కేసులో ఆధారాలను ఎన్‌ఐఏకు ఇవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేపదే ఎన్‌ఐఏ విచారణకు చంద్రబాబు అడ్డుపడటం చూస్తుంటే ఈ కేసులో ఆయన పాత్ర ఉందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తీరును అంతా గమనిస్తున్నారని.. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. 

చంద్రబాబుకు ఇతర పార్టీల నేతలు టైం ఇవ్వని పరిస్థితి..
ఇంకా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రంలో సమస్యలను వదిలి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. కానీ ఆయనతో మీటింగ్‌ అంటే ఇతర పార్టీల నేతలు టైం ఇవ్వని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. స్వప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈవీఎంలు వద్దని అంటున్నారని.. అయితే 2014లో ఆయన ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే గెలిచారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును కలసి వచ్చిన తర్వాత టీజీ వెంకటేశ్‌ జనసేనతో పొత్తు అంటూ మాట్లాడతారని.. కానీ ఆ కొద్ది సేపటికే టీజీపై చంద్రబాబు అసహనం అని లీకులు ఇస్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన అంతా ఒక్కటేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమికి చంద్రబాబు సాకులు వెతుక్కునే పనిలో పడినట్టుగా కనిపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు