రేపే ‘హిట్లర్‌’బాబు పతనమయ్యేది!

22 May, 2019 18:01 IST|Sakshi

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సైరా పంచ్‌

సాక్షి, హైదరాబాద్‌ : వంద మందిని తిన్న రాబందు ఒక్క గాలి వాన‌కు నేల కూలుతుంద‌న్న‌ది ఎంత నిజ‌మో.. ఎంత‌టి వారైనా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మ‌ట్టి కొట్టుకుపోతార‌న్న‌ది కూడా అంతే నిజమని చ‌రిత్ర చెబుతోంది. ప్ర‌పంచాన్నే శాసించాల‌నుకున్న హిట్ల‌ర్.. చివరకు నియంత‌గా చ‌రిత్ర‌లో మిగిలిపోయాడు. కాకతాళీయమో.. యాదృశ్చికమో కానీ నియంత హిట్లర్‌ జన్మదినం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఒకే రోజు (ఏప్రిల్‌ 20). ఇక జర్మనీలో హిట్లర్‌ పాలన అంతమైన రోజు 1945 మే 23 కాగా.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మే 23( రేపే) వెలువడటం విశేషం. ఇ​క ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు పతనం కూడా మే 23నే కాబోతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. హిట్లర్‌ బాబు పాలన రేపటితో ముగియనుందని ఆయన జోస్యం చెప్పారు.

ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సైతం విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. చక్రం తిప్పడం అంటే ఢిల్లీ చుట్టూ తిరగడం కాదనీ, ఢిల్లీ నేతలను మన చుట్టూ తిప్పుకోవడమనే సైరా పంచ్‌తో చురకలటించారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారని, కానీ చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయని మండిపడ్డారు. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని విమర్శించారు. 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త పని కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని, ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో  వారెవరూ లేరన్నారు. వాళ్లే అసలు ఉద్యోగం లేక, సగం పనితో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు