నాకు ఎమ్మెల్యే టికెట్‌.. నా కూతురికి పదవి..: నటి తల్లి

20 Mar, 2018 15:26 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా చీఫ్‌ రమ్యా దివ్యస్పందన తల్లి సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మాండ్యా నియోజకవర్గం నుంచి తనకు టికెట్‌ ఇవ్వాలని, తన కూతురికి పార్టీలో మంచి పదవి ఇవ్వాలని రమ్య తల్లి రంజిత డిమాండ్‌ చేశారు. ఒకవేళ తనకు టికెట్‌ ఇవ్వకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

‘మాండ్యా నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాను. ఈసారి టికెట్‌ నాకు ఇవ్వాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను కోరారు. ఒకవేళ వారు టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను’ అని రంజిత మీడియాతో తెలిపారు. పార్టీ కోసం తన కూతురు రమ్య ఎంతో కృషి చేస్తోందని, ప్రస్తుతం ఏఐసీసీ సోషల్‌ మీడియా అధిపతిగా ఢిల్లీలో రమ్య సేవలు అందిస్తోందని, కానీ, ఈ పదవి సరిపోదని, మాండ్యా ప్రజలతో అనుసంధానమయ్యేందుకు వీలుగా రాష్ట్ర పదవి కూడా ఆమెకు ఇవ్వాలని, అప్పుడే ఆమె మరింతగా సమర్థంగా పనిచేసేందుకు వీలుంటుందని తెలిపారు. అయితే, తల్లి వ్యాఖ్యలపై స్పందించేందుకు రమ్య నిరాకరించారు. అదేవిధంగా మాండ్యా నుంచి తానే స్వయంగా పోటీచేయాలని రమ్య భావిస్తున్నట్టు కథనాలు రాగా.. వాటిని ఆమె కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు