20 రోజులు..13 జిల్లాల్లో..68 సభలు

9 Apr, 2019 17:57 IST|Sakshi

తిరుపతిలో ముగిసిన వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఆయన  13 జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో పర్యటించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. గత నెల 17వ తేదీన తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి, ఇడుపులపాయ వద్ద సంచలన రీతిలో ఒకేసారి 175 మంది అసెంబ్లీ, 25 మంది లోక్‌సభ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆ రోజు నుంచే ఎన్నికల ప్రచారానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. 

20 రోజులపాటు ఆయన 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ప్రచారగడువు చివరి రోజైన ఈ నెల 9వ తేదీన ఆయన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ముగించారు. ఆయన మంగళవారం వరకూ మొత్తం 68 సభల్లో ప్రచారం చేశారు. అనంతపురం జిల్లాలో 6 నియోజకవర్గాల్లో కర్నూలు - 6, వైఎస్సార్‌ కడప- 5, చిత్తూరు - 5, నెల్లూరు - 3, ప్రకాశం- 5, గుంటూరు- 8, కృష్ణా- 6, పశ్చిమగోదావరి- 6, తూర్పుగోదావరి- 7, విశాఖపట్టణం- 6, విజయనగరం- 3, శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజకవర్గాల్లో జగన్‌ పర్యటించారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు