'చంద్రబాబు.. తొలిఅస్త్రంగానే రాజీనామాలు చేయించండి'

4 Mar, 2018 18:39 IST|Sakshi
అద్దంకి బహిరంగ సభలో వైఎస్ జగన్

హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్, రాయితీలొస్తాయి

ఊసరవెల్లికే రంగులు మార్చడం నేర్పుతున్న చంద్రబాబు

ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు

కరెంట్ ఛార్జీలు, పెట్రోలు ధరలతో భారీ దోపిడీ

సాక్షి, అద్దంకి: ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని, హోదా వల్ల రాయితీలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని, ఊసరవెల్లికే రంగులు మార్చడం నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. హోదా కోసం ఆఖరిఅస్త్రంగా మంత్రులతో రాజీనామా చేయిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.. కానీ ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి కనుక ఆఖరి అస్త్రంగా కాకుండా మొదటి అస్త్రంగానే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

'ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్‌సీపీ మార్చి1న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసింది. వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక రైలులో ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. హోదా కోసం రేపు ఢిల్లీలో ధర్నాలు చేస్తారు. మంగళవారం నుంచి పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు పోరాటం చేస్తారు. అప్పటికీ కేంద్రం దిగి రాకపోతే మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం పెడతాం. అయినా కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్ 6న పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు. చంద్రబాబు పార్ట్‌నర్‌ (పవన్ కల్యాణ్)కు చిత్తశుద్ధి ఉండి ఉంటే అవిశ్వాసానికి టీడీపీ ఎంపీలతో మద్దతు ఇప్పించాలి. మొత్తం 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగిరాదా..? చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు. ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి. మొదటి అస్త్రంగానే భావించి చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని' వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

బాబుతో పాటు మళ్లీ కరువొచ్చింది
చంద్రబాబు అధికారంలోకొచ్చి నాలుగేళ్లవుతోంది. ఆయనతో పాటు ఏపీకి ఏమొచ్చిందంటే కరువొచ్చింది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చంద్రబాబుతో పాటు కరువు ఆయన అడుగులో అడుగు వేసింది. ఈ ఏడాది 32 శాతం కరీప్ పంటకు వర్షలోటు ఉంది. రబీ పంటకు 71శాతం లోటు ఉన్న పరిస్థితుల్లో రైతున్నలను బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఆదుకోవాలి. కరీఫ్‌లో కరువొస్తే ఎవరైనా రబీలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు, రుణాలు ఇప్పిస్తారు, కానీ చంద్రబాబు మాత్రం రైతులను గాలికొదిలేశారు. ఇన్‌పుట్ సబ్సిడీలు, ఇన్సురెన్స్‌లు అందించలేదు. ఆఖరికి పండించిన పంటకు కనీసం గిట్టుబాట ధర కల్పించలేని వ్యక్తి సీఎం చంద్రబాబు. గత నాలుగేళ్లలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌కి తీసుకెళ్తే కనీసం రూ.4000కు కందులు అమ్ముకోలేని పరిస్థితి రైతులది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కందులు రూ. 9000 నుంచి రూ.10,000 ధర పలికేవి. కానీ కేవలం రెండంటే రెండు బస్తాలు మాత్రమే కొంటారు. అందులోనూ తేమశాతం ఉందని కుంటిసాకులు చెబుతూ రైతుల నుంచి కందులు కొనకుండా తప్పించుకుంటున్నారు. ఆ తర్వాత రైతులు దళారుల వద్దకు వెళ్తే.. టీడీపీ దళారులు రూ.4వేలకు కందులు కొంటారు. వాటినే చంద్రబాబు రూ.5000కు పైగా చెల్లించి కొనుగోలు చేస్తారని వైఎస్ జగన్ అన్నారు.

వైఎస్ జగన్ ప్రసంగంలోకి మరిన్ని అంశాలు..

  • ఓటుకు కోట్లు కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన టేపులు తెలంగాణ వద్ద ఉన్నాయి. అందుకే ఏ విషయంలోనూ నోరు తెరిచి ప్రశ్నించే స్థితిలో చంద్రబాబు లేరు. ఏమైనా అడిగితే తనను జైలుకు పంపిస్తారేమోనన్న భయం చంద్రబాబులో కనిపిస్తోంది. కేసుల్లో ఇరుక్కుపోయిన వ్యక్తి కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రయోజనాలపై ప్రశ్నించే సాహసం చేయలేరు
  • జన్మభూమి కమిటీల కారణంగా రేషన్ బియ్యం, పెన్షన్, ఆఖరికి మరుగుదొడ్లు కావాలన్న లంచం ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. మట్టి, ఇసుక, మద్యం ఇలా దేనిని టీడీపీ సర్కార్ వదలడం లేదు.
  • గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందని పరిస్థితి. ఎడమకాలువకు 28వేల ఎకరాలకు అందాల్సి ఉండగా కేవలం 12వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిస్తున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే ప్రాజెక్టులకు టెంకాయలు కొడతారు.
  • పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలలో రెట్లతో పోల్చితే కనీసం రూ.7 ఎక్కువగా వసూలు చేస్తూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు.
  • నాలుగేళ్ల పాలనలో మూడుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. గతంలో వందలోపు వచ్చే కరెంట్ బిల్లులు.. నేడు బాబు పాలనలో రూ.500, రూ.1000 వస్తుంది. 
  • గతంలో బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోదుమపిండి, పసుపు, చింతపండు, ఉప్పు, కిరోసిన్.. ఇవన్నీ ప్యాక్‌చేసి రూ.185 లకే చేతిలో పెట్టేవారు. ప్రస్తుతం రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప ఇంకేం దొరకడం లేదు. ఒకవేళ ఇంట్లో ఆరుగురుంటే ఏదో సాకుచెప్పి ఇద్దరి వాటా బియ్యాన్ని ఎగ్గొడుతున్నారు.
  • పిల్లలు తాగి చెడిపోతున్నారు. అధికారంలోకి వస్తూనే బెల్ట్ షాపులు తగ్గిస్తాం. చర్యలు తీసుకుంటామని గతంలో చంద్రబాబు చెప్పారు. గ్రామాల్లో మినరల్ వాటర్‌ ప్లాంట్ ఉందో లేదో కానీ మందు లేని గ్రామం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు.
  • ఫోన్ కొడితే ఇంటికి మినరల్ వాటర్ తెచ్చిస్తారో లేదో తెలియదు కానీ ఫోన్ కొడితే మద్యం సీసాలు ఇంటికి తెచ్చే పాలన అందించడమే చంద్రబాబు సాధించిన ఘనత.
  • నాలుగేళ్లు గడిచినా చంద్రబాబు తాను చెప్పినట్లుగా డ్వాక్రా, ఇతర రుణాలు మాఫీ చేయకపోగా.. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. అక్కాచెల్లెమ్మల ఇళ్లకు వచ్చి తాళాలు వేయడం చూస్తున్నాం. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల రుణాలు ఒక్క రుపాయి కూడా మాఫీ కాలేదు.
  • జాబ్ రావాలంటే బాబు రావాలని గొప్పలు చెప్పారు చంద్రబాబు. జాబ్ రాకపోతే వారికి ఉపాధి అయినా, లేక ఉద్యోగం.. లేని పరిస్థితుల్లో రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకూ చంద్రబాబు ఒక్కో నిరుద్యోగికి రూ.96,000 బాకీ పడ్డారు. ఒకవేళ చంద్రబాబు కనిపిస్తే మా బాకీ పరిస్థితి ఏంటని నిలదీయాలన్నారు.
  • 108కి పోన్ కొడితే అంబులెన్స్ వస్తుందన్న నమ్మకం పోయింది. మా ఉద్యోగులు ధర్నాలో ఉన్నారని, వాహనం టైర్లు బాగాలేవని, ఇంధనం లేదని సమాధానం వస్తుంది. పెద్ద ఆపరేషన్ల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్‌కి వెళ్తే ఏపీ వారికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు.
  • మూగ, చెవుడు కోసం కాంక్లియర్ ఇంప్లాయింట్ కోసం రూ.6-7 లక్షలు అవుతాయి. నాన్నగారి హయాంలో పిల్లలు ఆపరేషన్ చేయించుకుని నవ్వుతూ ఇంటికి వెళ్లేవారు. చంద్రబాబు హయాంలో మాత్రం ఆపరేషన్‌కు డబ్బులు లేక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నారు. 
  • నెట్‌వర్క్ ఆసుపత్రులకు బాకీ పడ్డారని, వాళ్లు వైద్య చికిత్సలు అందించడం లేదు. మేం అధికారంలోకి వస్తే నవరత్నాలతో పేదవాళ్ల జీవితంలో వెలుగులు నింపుతాం
  • దివంగత సీఎం వైఎస్ఆర్ పేదవాళ్ల కోసం ఒక అడుగు ముందుకేశారు.. ఇప్పుడు ఆయన తనయుడిగా మీకోసం జగన్ రెండడుగులు ముందుకేసేందుకు సిద్ధంగా ఉన్నాడని భరోసా ఇచ్చారు.     

మరిన్ని వార్తలు