ఏది అప్రజాస్వామికం?

17 May, 2019 20:56 IST|Sakshi

దళితుల ఓట్లన్నీ మీరే వేసుకోవడమా?

ఆ అరాచకాలను చెవిరెడ్డి అడ్డుకోవడమా?

చంద్రగిరి రీపోలింగ్‌పై సీఎం చంద్రబాబు విమర్శలకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్పందన 

సాక్షి, అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో దళితుల్ని ఓటు వేయకుండా చేసి వారి ఓట్లు తెలుగుదేశం పార్టీ నేతలే వేయడం అప్రజాస్వామికమా? లేక అక్కడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి టీడీపీ నేతల అరాచకాలకు అడ్డుపడడం అప్రజాస్వామికమా అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై శుక్రవారం రాత్రి  జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

ఆ ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీ పోలింగ్‌ ప్రక్రియను ప్రజాస్వామికంగా జరిపించాలని ఎన్నికల సంఘాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌ పూర్తి సారాంశం..  ‘చంద్రబాబు గారూ రీ పోలింగ్‌ అప్రజాస్వామికమా? లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయడం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ ఆరాచకాలకు అడ్డుపడడమా? రీపోలింగ్‌ అంటే మీకెందుకు జంకు? ఐదు పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
  

>
మరిన్ని వార్తలు