సులభంగా మోసం చేయవచ్చనా?
చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆగ్రహం
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఎన్నికల సమయంలోనే బలహీన వర్గాలపై చంద్రబాబు ప్రేమ కురిపిస్తారని, ఎన్నికలు లేకుంటే వాళ్లసలు గుర్తుకే రారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. బీసీలను ఉద్ధరించడానికే పుట్టినట్టు ఆయన మాట్లాడుతుంటారని, నిజానికి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపే ఆలోచనే లేదని మండిపడ్డారు. సహకార వ్యవస్థను ధ్వంసం చేసిందే చంద్రబాబని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా తాను పుట్టిన చిత్తూరు జిల్లాకు హంద్రీ–నీవా, గాలేరు–నగరి కాల్వలను తీసుకురాలే దన్నారు. తమ ప్రభుత్వం రాగానే నగరి నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 63వ రోజు మంగళవారం నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడికి భరోసా కల్పిస్తానని, విద్యా, వైద్యం కోసం పేదవాడు అప్పుల పాలు కాకూడదన్నదే తన ధ్యేయమన్నారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..
సహకార వ్యవస్థ ధ్వంసం
‘‘నగరి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి అనేక మంది తమ కన్నీటి గాథలను చెబుతూనే, అన్నా.. నీకు తోడుగా ఉంటాం అని నా భుజం తడుతున్నారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి చాలా మంది రైతులు వచ్చి ‘అన్నా.. ఇదే నియోజకవర్గంలో రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అది సహకార రంగంలో ఉండేది. మా జిల్లాలో మొత్తం ఆరు చక్కెర ఫ్యాక్టరీలు ఉంటే అందులో రెండు సహకార రంగంలోనివి. మా ఖర్మ ఏంటంటే చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా సహకార ఫ్యాక్టరీలు మూత పడతాయన్నా’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సహకార ఫ్యాక్టరీలు నడిస్తే రైతులకు మంచి రేట్లు వస్తాయి. చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రైతులు అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే 51 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని తెరిపించారు. నాన్నగారి పుణ్యమా అంటూ పదేళ్ల పాటు రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్లీ నాలుగేళ్ల కిందట చంద్రబాబు సీఎం కావడంతో ఆ రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చంద్రబాబు దగ్గరుండి మరీ రైతులను నాశనం చేస్తున్నారు.
పాల డెయిరీలనూ నాశనం చేశారు..
సహకార రంగంలోని డెయిరీలు రైతులకు మంచి రేట్లు ఇస్తాయి. పాల ధరలు పెరిగి రైతులు సంతోషంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అందుకని తన మనుషులతో హెరిటేజ్ పాల డెయిరీ పెట్టించి దగ్గరుండి ఒక పథకం ప్రకారం విజయా డెయిరీగా ఖ్యాతి గాంచిన చిత్తూరు డెయిరీని మూత వేయించారు.
ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇవ్వడమే ప్రేమట!
చంద్రబాబు నోటి నుంచి మాటిమాటికి వచ్చే మాట బీసీలు. వాళ్ల మీద బోలెడు ప్రేమను వొలకబోస్తుంటాడు. చిత్రమేమిటంటే ఎన్నికల సమయంలోనే ఆయనకు బీసీలు గుర్తుకు వస్తుంటారు. ఎందుకో తెలుసా? వాళ్లనైతే సులువుగా మోసం చేయవచ్చని. (జనం నుంచి ఈలలు, కేకలు) అందుకే ఆయన తన సొంత నియోజకవర్గం చంద్రగిరి అయినా జిల్లాలోనే బీసీలు అధికంగా ఉన్న కుప్పం నుంచి పోటీ చేస్తారు. చంద్రగిరిలో మాత్రం పోటీ చేయడు. 4 ఇస్త్రీ పెట్టెలు, 4 కత్తెర్లు ఇచ్చి ఇదే బీసీలపై ప్రేమని చెబుతాడు.
జనం మధ్యలో జగన్ సంక్రాంతి సంబరాలు
హరిదాసులు, ముత్యాల ముగ్గులు, గంగిరెద్దులు, పూరిళ్లు, కొలువు దీరిన గొబ్బెమ్మలు, బంతిపూల హరివిల్లులు... సంక్రాంతి పర్వదినం సందర్భంగా సోమవారం వైఎస్ జగన్ బస చేసిన శిబిరం వద్ద కనిపించిన దృశ్యాలివి. తెలుగింట పెద్ద పండుగ అయిన సంక్రాం తి సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటిం చిన జగన్.. తాను బస చేసిన శిబిరం వద్ద ప్రజలు, బంధు మిత్రులు, ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషుల మధ్య వేడుకలు జరుపుకున్నా రు. సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.
పల్లె వాతావరణాన్ని తలపించేలా వేసిన రెండు పూరిళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నమస్కరిం చారు. సంప్రదాయబద్ధంగా పెద్దలకు బట్టలు పెట్టారు. పండుగ సందర్భంగా కోలాటాన్ని, భజనలను, పతంగుల ఎగురవేతను ప్రత్య క్షంగా తిలకించారు. హరిదాసులు శ్రావ్యంగా కీర్తనలు ఆలపిం చారు. మహిళలు సంప్రదాయ నృత్యాలు చేశారు. గంగిరెద్దుల వాళ్లు తమ ఆటలతో అలరించారు. జగన్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభా కాంక్షలు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు అష్టఐశ్వ ర్యాలు కలగాలని ఆకాంక్షించారు. జగన్కు వేదపండితులు ఆశీర్వచనా లు అందించారు. ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.